– రుతుపవనాలు వచ్చేస్తున్నాయి
– రైతులు నాగళ్లు పడుతున్నారు
– పెట్టుబడి సాయం ఎప్పటికి ఇస్తారు?
– కేసీఆర్ ఫాంహౌస్ వీడాలి
– రైతులపై దృష్టి పెట్టాలి
– బహిరంగ లేఖలో బండి ప్రశ్నలు
ఫాంహౌస్ ముఖ్యమంత్రికి రైతుల కష్టాలు పట్టవంటూ ఎద్దేవ చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. రాష్ట్రంలోని అన్నదాతల సమస్యలపై కేసీఆర్ కు ఆయన లేఖ రాశారు. ఎనిమిదేళ్ల పాలనలో రైతుల కంటకన్నీరు.. కేసీఆర్ ఫాంహౌస్ పంట పన్నీరు అయిందని విమర్శించారు. అందుకే ఈ బహిరంగలేఖ ద్వారా తెలంగాణలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తున్నట్లు చెప్పారు.
“తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య ప్రభుత్వం నుండి సకాలంలో వారికి అందాల్సిన సహాయం రాకపోవడం. ముఖ్యంగా రైతుబంధు నిధులు విడుదల కావడం లేదు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు. ఇవన్నీ రైతాంగం, రైతుసంఘాలు మా దృష్టికి తీసుకొచ్చాయి. 2018 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారం లక్షరూపాయల రైతు రుణమాఫీ అమలు కాకపోవడంతో వడ్డీల మీద వడ్డీలు పెరిగి రైతుల ఆర్థిక పరిస్థితి చితికిపోయింది. ప్రభుత్వం నుండి అందాల్సిన సహాయం అందక తెలంగాణ రైతులు ఇబ్బందిపడుతుంటే వారిని గాలికొదిలేసి కేసీఆర్ మాత్రం దేశవ్యాప్తంగా వ్యక్తిగత ప్రచారం, ప్రతిష్ట పెంచుకోవడం కోసం చూస్తున్నారు. కేటీఆర్ విదేశీ పర్యటనలకు ప్రభుత్వ ఖజానా నుండి కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నారు. రాష్ట్రానికి వెన్నెముక అయిన రైతులకు రుణమాఫీ చేసే విషయంలో కానీ, రైతుబంధు నిధులను విడుదల చేసే విషయంలో కానీ పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. దీనిపైన తెలంగాణ రైతాంగానికి మీరు జవాబు చెప్పాలి” అని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో రెండు మూడు రోజుల్లో రుతుపవనాలు ప్రవేశిస్తాయని ఇప్పటికే వాతావరణశాఖ వెల్లడించిన విషయాన్ని గుర్తు చేశారు బండి. అనేక ప్రాంతాల్లో రైతులు ఇప్పటికే దుక్కులు దున్ని పొలం పనులు ప్రారంభించారని.. ఇప్పటివరకు రైతుబంధు నిధులను ఖాతాల్లో జమ చేయలేదని మండిపడ్డారు. “పంటకాలంలో పెట్టుబడికోసం రైతాంగం అక్కడా ఇక్కడా అప్పులు చేయాల్సిన అగత్యం ఉండకూడదని రైతుబంధు పథకం ప్రవేశపెట్టామని చెప్పుకునే ప్రభుత్వం సమయానికి డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఈ హామీ నీటిమీద రాతలుగానే మిగిలిపోయింది, కాగితాలకే పరిమితమైంది తప్ప క్షేత్రస్థాయిలో అమలు సరిగ్గా జరగడం లేదని విమర్శించారు.
“రైతుబంధు పథకం ప్రవేశపెట్టినప్పటి నుండి కేవలం 2018 లోనే ముందస్తు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నిధుల్ని సకాలంలో మంజూరు చేశారు. 2019, 2020, 2021 సంవత్సరాల్లో అవసరమైన సమయంలో విడుదల చేయకుండా, దఫాలవారీగా ఇచ్చి రైతులను అనేక ఆర్థిక ఇబ్బందులకు గురిచేశారు. ఈ విషయం రాష్ట్రంలో ఏ ఒక్క రైతును అడిగినా తమగోడు చెపుతారు. ఫాంహౌస్ లో సేదతీరే కేసీఆర్ కు రైతులు పడుతున్న కష్టాలు అర్థంకావు. రైతులకు వ్యవసాయ పెట్టుబడికి సీజన్ ప్రారంభంలోనే డబ్బు అవసరమౌతుందన్న విషయం తెలియదా? ప్రభుత్వం రైతుబంధు ఖాతాలో నిధులు జమచేయకపోతే పెట్టుబడి సహాయం కోసం రాష్ట్రంలోని రైతాంగం ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్థులను ఆశ్రయించాల్సి వస్తుంది. ఇప్పటికే వారి కబంధ హస్తాల్లో చిక్కుకున్న రైతుల బాధలు వర్ణానాతీతం. వడ్డీ చెల్లించలేక అనేక మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు కూడా తెలంగాణలో నిత్యం జరుగుతున్నాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రప్రభుత్వం వెంటనే రైతుబంధు పథకానికి అర్హులైన ప్రతీ ఒక్క రైతు ఖాతాలో నిధులను జమచేయాలి” అని డిమాండ్ చేశారు బండి సంజయ్.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల కిసాన్ సమ్మాన్ నిధి కింద తెలంగాణ రాష్ట్రానికి అందించిన సహాయం గురించి ప్రస్తావించారు. ప్రధానమంత్రి రైతులకు అందించిన సహాయం వల్లనే వారికి కొంత ఊరట లభించిందన్నారు. మోడీ పాలనలో ఒకవైపు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు మూడెంచెల విధానాన్ని అమలు చేస్తూనే… మరోవైపు కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులను ఆదుకుంటూ వారికి భరోసా ఇస్తున్నారని కొనియాడారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు కిసాన్ సమ్మాన్ నిధి కింద 11 కోట్ల 30 లక్షల రైతుల ఖాతాల్లో లక్షా 82 వేల కోట్ల రూపాయలను జమ చేయగా ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 29 లక్షల మంది రైతుల ఖాతాల్లో 5 వేల 8 వందల కోట్ల రూపాయల నిధులను జమ చేయడానికి చర్యలు తీసుకున్నారని చెప్పారు. తెలంగాణలో ఒక్కో రైతు ఖాతాలో 20 వేల రూపాయలను కేంద్రప్రభుత్వం జమ చేసిందన్నారు. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా తెలంగాణ రైతుల ఖాతాల్లో 580 కోట్ల రూపాయల నిధులను మే 31న జమ చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
“గోబల్స్ కు వారసులైన టీఆర్ఎస్ ప్రతినిత్యం బీజేపీ, మోడీపై అనేక అభాండాలు వేస్తూ తప్పుడు ప్రచారం చేస్తోంది. వాస్తవాలను తెలంగాణ రైతాంగానికి తెలియజేయాలనే సదుద్ధేశంతో కొన్ని అంశాలను ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నా. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిది ఏళ్లలో అన్ని పంటల మద్దతు ధరలు దాదాపు రెట్టింపు అయ్యాయి. బుధవారం 14 పంటలకు ఎమ్మెస్పి పెంచింది. వరికి రూ.100, పత్తి రూ.350, పల్లి రూ. 300, కందులు రూ.300, పెసర్లు రూ.480, తెల్లనువ్వులు రూ.523, మక్కలు రూ.92.. ఇలా రైతులకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా తన వైఖరి మార్చుకుని రైతులు పండించిన పంటకు మార్కెటింగ్ సౌకర్యాలు పెంచాలి. అదేవిధంగా అవకాశం ఉన్న మేర మద్దతు ధరకు అదనంగా కొన్ని పంటలకు సబ్సిడీని బోనస్ అందించాలి. ఫసల్ బీమా యోజన పథకం ద్వారా పంట నష్టపోయిన రైతులకు చేయూతగా నిలబడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వ స్కీమ్ ను, ఫలితాలు రైతులకు అందేవిధంగా బకాయిపడ్డ తమ వాటా డబ్బును వెంటనే చెల్లించాలి. రైతులకు అనుకూలంగా ఉండే విధంగా రైతు ఆర్థికంగా అభివృద్ధి చెంది, రైతే రాజుగా ఉండాలనేదే ప్రధాని లక్ష్యం. ఇప్పటికైనా కేసీఆర్ ఫాంహౌస్ వీడి ప్రధానమంత్రిని ఆదర్శంగా తీసుకొని ఆయన బాటలో నడుస్తూ రైతు అనుకూల నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నా” అని చెప్పారు.