ఎంపీపై కత్తులతో, కర్రలతో దాడులు చేసి హత్యాయత్నం చేస్తే ఇప్పటికీ ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం సిగ్గుచేటన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. నందిపేటలో మీడియాతో మాట్లాడారు. అరవింద్ పై టీఆర్ఎస్ నాయకులు చేసిన హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తనను గెలిపించిన ప్రజల కష్టసుఖాల్లో అండగా ఉండాలని, ఎంపీ నిధులను వెచ్చించి గ్రామాలను అభివృద్ధి చేసేందుకు వెళ్లిన అరవింద్ పై దాడి హేయమైన చర్యగా అభివర్ణించారు. పాతబస్తీ గడ్డ మీద గర్జించి కొట్లాడిన పార్టీ బీజేపీ అనే సంగతిని గుర్తుంచుకోవాలన్నారు.
సీఎం కేసీఆర్ నిరాశలోకి వెళ్లిపోయారని.. అందుకే అసహనంతో దాడులు జరుగుతున్నాయని విమర్శించారు బండి. 1400 మంది బలిదానాలతో తెలంగాణ వచ్చింది ఎందుకు? దాడులు చేయడానికా? అని ప్రశ్నించారు. రుణమాఫీ చేయలేదు, దళిత బంధు అమలు చేయలేదు, ఇంటికో ఉద్యోగం ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు.. మరి హామీలు నెరవేర్చని మీపై దాడులు చేయాలిగా అంటూ కౌంటర్ ఇచ్చారు. తప్పు చేస్తే ప్రశ్నించడమే పాపమా? సాక్షాత్తు రాష్ట్ర సీఎం దాడులు చేయాలంటూ ఉసిగొల్పుతుంటే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
దాడులు బీజేపీకి కొత్త కాదన్న సంజయ్.. నక్సల్స్ చేతిలో చస్తామని తెలిసి కూడా జనం కోసం త్యాగాలకు వెనుకంజ వేయని కార్యకర్తలు బీజేపీకి ఉన్నారని అన్నారు. కేసీఆర్.. ఆయన కుటుంబ సభ్యులు చేసిన త్యాగమేంటని అడిగారు. తెలంగాణ నెంబర్ వన్ ద్రోహి కేసీఆరేనని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతకాలంటే ఈసారి బీజేపీకి అధికారం ఇవ్వాలని ప్రజలు నిర్ణయించుకున్నారని చెప్పారు. అది తెలిసి ఓర్వలేక, అసహనంతో బీజేపీ నేతలపై కేసీ దాడులకు పురిగొల్పుతున్నారని మండిపడ్డారు.
ప్రజల కోసం దాడులు భరించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు సంజయ్. మూర్ఖపు కేసీఆర్ పాలన నుండి ప్రజలను విముక్తి చేయడానికి ఏ త్యాగానికైనా రెడీ అని చెప్పారు. తాము దాడులకు పాల్పడితే… కేసీఆర్ బిస్తర్ సర్దుకుని పోవాల్సిందేనని హెచ్చరించారు. “ఉద్యోగులు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు కేసీఆర్ శవయాత్ర చేస్తే భయపడి పారిపోయిన సంగతి మర్చిపోయినవా? పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు నువ్వు ఓటింగ్ లో ఎందుకు పాల్గొనలేదు? బీజేపీ తెలంగాణ బిల్లుకు మద్దతివ్వకపోతే ఈనాడు సీఎం సీటులో కూర్చునే వాడివి కాదనే సంగతి గుర్తుంచుకో. కేసీఆర్… నువ్వు తెలంగాణలో అధికారంలో ఉంటే మేం కేంద్రంలో ఉన్నామనే సంగతి తెలుసుకో. అరవింద్ పై జరిగిన దాడిపైనా పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తాం. పోలీసులూ రాబోయేది బీజేపీ ప్రభుత్వమే. కేసీఆర్ మాటలు వింటే నష్టపోతారు” అని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో ఐపీఎస్, ఐఏఎస్ లు చాలా బాధపడుతున్నారని చెప్పారు బండి. తమతోటే చట్ట వ్యతిరేక పనులు చేయిస్తున్నారంటూ… చాలా మంది ఐపీఎస్ లు ఫీల్ అవుతున్నారని అన్నారు. అరవింద్ పై దాడి జరుగుతుందని ముందే డీజీపీకి, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ లకు తెలుసని ఆరోపించారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులు సీఎం డైరెక్షన్ లో స్వయంగా దాడులు చేయించడం దారుణమన్నారు. అరవింద్ పై జరిగిన దాడి ముమ్మాటికీ నిజామాబాద్ సీపీకి తెలిసి జరిగిన హత్యాయత్నమేనని స్పష్టం చేశారు. ఎంపీ అభివృద్ధి పనుల్లో పాల్గొంటే తప్పా? ఎంపీపై దాడి జరిగితే సీఎం స్పందించరు… డీజీపీ, సీపీ మాట్లాడలేని దుస్థితి.. టీఆర్ఎస్ గూండాల దాడిలో తీవ్రంగా గాయపడ్డ బీజేపీ కార్యకర్తలు చేసిన తప్పేంది? దాడులు చేసిన వాళ్లంతా గుండెమీద చేయి వేసుకుని ఆలోచించండి.. మీకూ కుటుంబ సభ్యులున్నారు.. మీపై దాడులు జరిగితే వాళ్లు ఎంత బాధపడతారో ఆలోచించండి అంటూ హెచ్చరించారు.
దాడులు చేసిన వాళ్లంతా బయట తిరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు బండి. రేపు బీజేపీ నేతలపైనే ఉల్టా కేసులు పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్నారు. నిజాం పాలనలోనూ ఇంతటి నిర్బంధాలను చూడలేదని ప్రజలు భావిస్తున్నారన్న ఆయన.. టీఆర్ఎస్ నేతలు గవర్నర్ వ్యవస్థను గౌరవించలేని సంస్కార హీనులు అని విమర్శించారు. టీఆర్ఎస్ అవినీతి, అక్రమాలు బయటకొస్తున్నాయని.. సాక్షాత్తు మంత్రిగా ఉంటూ ఎన్నికల కమిషన్ కు తప్పుడు అఫిడవిట్ ఇచ్చిన వారిపై విచారణ మొదలైందన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలను హద్దుల్లో ఉంచుకోవాలని కేసీఆర్ కు వార్నింగ్ ఇచ్చారు. తమను రెచ్చగొడితే ఊరుకునే ప్రసక్తే లేదని.. సీఎంకు మానవత్వం ఉంటే ఈ దాడిని ఖండించాలన్నారు. అలాగే దాడికి పాల్పడ్డ వారిని, అందుకు సహకరించిన సీపీపై వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రైతులెవరూ కత్తులతో దాడులు చేయరన్న బండి… ఆ సంస్కృతి మన రైతాంగానికి లేదన్నారు. టీఆర్ఎస్ గూండాలే ఎంపీపై దాడులకు తెగబడ్డారని ఆరోపించారు. తెలంగాణ రైతులు అన్యాయం జరిగితే ప్రశ్నిస్తారే తప్ప దాడులు చేయరన్నారు. ఇక అరవింద్ పై జరిగిన దాడి సమాచారం అందుకున్న వెంటనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, తెలంగాణ ఇంఛార్జ్ తరుణ్ చుగ్ ఫోన్ చేసి బాసటగా ఉన్నట్లు తెలిపారు సంజయ్. ఈ సందర్భంగా జాతీయ నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. బీజేపీ కార్యకర్తలెవరూ అధైర్యపడొద్దని…. ప్రజల కోసం తెగించి కొట్లాడదామని భరోసానిచ్చారు.