– ఫిర్యాదు చేసిన 5 రోజుల దాకా చర్యలేవి?
– ట్విట్టర్ పిట్ట చెబితేనే హోంమంత్రి, డీజీపీ, సీపీ కదులుతారా?
– కేసు నుండి నిందితులను తప్పించే కుట్ర జరుగుతోంది
– మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఎందుకు నమోదు చేయలేదు?
– జూబ్లీహిల్స్ పబ్ ఘటనపై బండి ప్రశ్నలు
జూబ్లీహిల్స్ పబ్ ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నా వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ డిమాండ్ చేశారు. కేసులో హోంమంత్రి మనవడు, ఎమ్మెల్యే, వక్ఫ్ బోర్డు ఛైర్మన్ కుమారులతోపాటు టీఆర్ఎస్ నాయకుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలున్నాయని అన్నారు. వారందరినీ ఈ కేసు నుండి తప్పించాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుండి పోలీసులకు ఆదేశాలొచ్చాయని ఆరోపించారు. సీఎంఓ ఆదేశాలతో ఈ కేసును నీరుగార్చేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు బండి. టీఆర్ఎస్ ప్రభుత్వంతోపాటు పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
‘‘జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం ఘటనలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సిగ్గు చేటు. పోలీసులు, ప్రభుత్వ తీరువల్ల రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తుతోంది. హైదరాబాద్ క్రిమినల్స్ కు, అక్రమ దందాలకు అడ్డాగా మారింది. దేశవ్యాప్తంగా హైదరాబాద్ పై చర్చ జరుగుతోంది. ఆ పబ్ లో అసలు పార్టీ అరెంజ్ చేసిందెవరు? గత నెల 28న మైనర్ బాలికపై ఎవరెవరు అత్యాచారం చేశారో స్పష్టంగా ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినా ఎందుకు స్పందించలేదు? ఎందుకు విచారణ జరపలేదు? ఎఫ్ఐఆర్ లో వారి పేర్లు ఎందుకు నమోదు చేయలేదు? అత్యాచారం జరిగి 5 రోజులైనా నిందితులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు’’ అని ప్రశ్నించారు బండి.
28న అఘాయిత్యం జరిగితే ఇప్పటిదాకా ఎందుకు గోప్యంగా ఎందుకు ఉంచారని నిలదీశారు. ముఖ్యమంత్రి ఈ ఘటనపై ఎందుకు స్పందించడం లేదని అడిగారు. మైనర్ బాలికపై అత్యాచారం జరిగితే పోక్సో కింద సీఆర్పీసీ 164 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేయాలి.. మెజిస్ట్రేట్ ఎదుట అమ్మాయి స్టేట్ మెంట్ రికార్డు చేయాలి.. కానీ ఇక్కడెందుకు ఆ పని చేయడం లేదని నిలదీశారు. సీసీ పుటేజీలో అన్ని ఆధారాలు రికార్డై ఉన్నాయని… ఇన్ని రోజులపాటు అవి ఎందుకు దొరకలేదు? హైదరాబాద్ లో కోట్లు పెట్టి వేల కొద్ది సీసీ పుటేజీలెందుకున్నట్లు? అంటూ ఫైరయ్యారు. ‘‘పాతబస్తీలో పోలీసులపైనా, విద్యుత్ సిబ్బందిపైనా దాడులు చేస్తే పట్టించుకోరు. నిర్మల్, కోదాడలో మైనర్ బాలికపై టీఆర్ఎస్ గూండాలు అత్యాచారం చేస్తే పట్టించుకోరు. మంథనిలో లాయర్ వామనరావు హత్య జరిగినా, రామాయంపేటలో వైశ్య కుటుంబం ఆత్మహత్య చేసుకున్నా, కొత్తగూడెంలో కుటుంబం ఆత్మహత్య చేసుకున్నా.. ఖమ్మంలో బీజేపీ సాయిగణేష్ ఆత్మహత్య చేసుకున్నా.. అందుకు కారణం టీఆర్ఎస్ నేతలేనని మరణ వాంగ్మూలం ఇచ్చినా ఎందుకు చర్యలు తీసుకోరు? టీఆర్ఎస్ గూండాలు దాడులు చేసినా.. హత్యలు చేసినా.. ఆత్మహత్యలకు కారకులైనా సీఎం మాత్రం స్పందించరు? టీఆర్ఎస్ ప్రభుత్వ చర్యల వల్ల పోలీస్ వ్యవస్థ మీద రాష్ట్ర ప్రజలకు నమ్మకం లేకుండా పోయింది’’ అంటూ ఆరోపించారు.
‘‘చట్ట ప్రకారం పనిచేయకుండా పోలీసులు నిందితుల కొమ్ముకాస్తారా? చంచల్ గూడ జైల్లో ఉండాల్సిన క్రిమినల్స్ ను కాపాడతారా? నిందితులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నిస్తున్న బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేస్తారా? మహిళలని చూడకుండా పిడిగుద్దులు గుద్దుతారా? బట్టలు చింపుతారా? బీజేపీ కార్యకర్తలపై దాడులు చేయడానికి కఠినంగా వ్యవహరిస్తున్న పోలీసులు.. క్రిమినల్స్ ను ఎందుకు అరెస్ట్ చేయరు? సాక్షాత్తు హోంమంత్రి మనవడిపైనే ఆరోపణలొస్తుంటే.. ట్విట్టర్ పిట్ట హోంమంత్రితోనే విచారణ జరిపించాలని ఆదేశిస్తారా? హోంమంత్రి, డీజీజీ, సీపీ ట్విట్టర్ పిట్ట చెబితే తప్ప స్పందించరా? క్రిమినల్స్ ను క్రిమినల్స్ గా చూడకపోవడంవల్లే ఈ సమస్య ఉత్పన్నమవుతోంది. దీనిపై ప్రశ్నిస్తున్న బీజేపీ నేతలపై మతం జోడించి ఆరోపణలు చేయడం సిగ్గు చేటు’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సంజయ్.
హైదరాబాద్ అత్యాచారాలు, డ్రగ్స్, హత్యలకు అడ్డాగా మారిందని.. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమవుతోందన్నారు. అత్యాచారం కేసులో బాధితులను నయానో భయానో బెదిరించి కేసును నీరుగార్చి మూసేసే కుట్ర జరుగుతోందన్న ఆయన.. నిందితులను కేసు నుండి తప్పించాలని సీఎంఓ నుండి ఆదేశాలొస్తున్నాయన్నారు. నిజాయితీగల పోలీసులు ఆ శాఖలో పనిచేయాలంటేనే సిగ్గుపడే స్థితికి వచ్చిందని ఆరోపించారు. బాధితుల పక్షాన ప్రశ్నిస్తున్న బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేయడం బాధాకరమని… తక్షణమే వారందరినీ బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు బండి సంజయ్.