– బీజేపీ అధికారంలోకి వస్తుంది..
– భాగ్యలక్ష్మి ఆలయం, భైంసా, ఉట్కూర్ ను దత్తత తీసుకుంటాం
– పోలీసుల దాడిలో గాయపడ్డ తమ్ముళ్లకు ఉద్యోగాలిప్పిస్తాం
– ఉట్కూర్, భైంసాలో హిందువులను చిత్రహింసలు పెట్టిన..
– పోలీసులపై ప్రతీకారం తీర్చుకుంటాం
– రాష్ట్రానికి 5న నడ్డా, 14న అమిత్ షా వస్తున్నారు..
– ఉట్కూర్ సభలో బండి సంజయ్
బీజేపీ అధికారంలోకి రాగానే పాతబస్తీ భాగ్యలక్ష్మీ దేవాలయం, బైంసా, ఉట్కూర్ ప్రాంతాలను దత్తత తీసుకుంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్రకటించారు. 14వ రోజు పాదయాత్రలో భాగంగా ఎడవెల్లి గేట్ దగ్గర పార్టీ జెండా ఆవిష్కరించారు. పిల్లలు, యువకులు, పెద్దలు, మహిళలు అనే తేడా లేకుండా భారీ ఎత్తున తరలివచ్చారు. పెద్ద ఎత్తున ఎడ్ల బండ్లతో సంజయ్ కు స్వాగతం పలికారు. మోటార్ బైక్ ర్యాలీలతో పార్టీ జెండాలు చేతపట్టి వెంట సాగారు. పాదయాత్ర ఉట్కూర్ చేరుకోగానే అక్కడి నేలను ముద్దాడారు బండి. మట్టిని తిలకంగా దిద్దుకున్నారు. అనంతరం ఉట్కూర్ కు తరలివచ్చిన భారీ జన సందోహాన్ని ఉద్దేశించి బండి ప్రసంగించారు.
ఊట్కూరులో పోలీసుల చిత్రహింసలకు గురై అనేక కేసులతో ఇబ్బంది పడుతున్న యువకులను ఆదుకోవడంతోపాటు వారికి ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చారు. ఉట్కూర్, బైంసాలో హిందువులను చిత్రహింసలు పెట్టిన పోలీసులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని.. వారు ఎక్కడున్నా రప్పించి చట్ట బద్దంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 69 జీవోను అమలు చేసి ఉట్కూర్ సహా మక్తల్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు. హిందూ రాజ్యం స్థాపించడమే తమ ధ్యేయమని చెప్పారు బండి. టీఆర్ఎస్ వాళ్లు తన చావు కోరుకుంటున్నారని.. గుండెపోటు వస్తే కార్యకర్తలు పూజలు చేశారని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో పైదాకా పోయొచ్చానని.. తనను చూసి చావే భయపడుతుందన్నారు. హిందూ ధర్మం ఎవరి చావునూ కోరుకోదన్న బండి.. తాను హిందువునని గర్వంగా చెప్పుకుంటానని చెప్పారు.
ఊట్కూరులో బీజేపీ కార్యకర్తలు తెగించి కొట్లాడుతున్నారని.. గూండాల చేతిలో దెబ్బలు తిన్నా.. కళ్లు, కాళ్లు కోల్పోయినా వెరవకుండా యుద్ధం చేస్తున్నారన్నారు సంజయ్. వారందరికీ సెల్యూట్ చేస్తున్నట్లు తెలిపారు. 69 జీవోను అమలు చేస్తే మొట్టమొదట నిండేది ఉట్కూర్ చెరువేనని.. 15 గ్రామాలకు సాగు నీళ్లందుతాయని వివరించారు. బీజేపీ అధికారంలోకి రాగానే 69 జీవోను అమలు చేసి తీరుతామని… ప్రాజెక్టుల నిర్మాణం చేపడతామని చెప్పారు. ‘‘నేను మత తత్వాన్ని రెచ్చగొడుతున్ననట. నేనింకా పూర్తిగా మాట్లాడలేదు. ఉట్కూర్ ప్రజలు హీరోలు.. యువకుల చరిత్ర విన్న తరువాత చలించిపోయా. ఇక్కడి వారు వీర యోధులు… అంబేద్కర్, సావర్కర్ వారసులు.. పోలీసులు ఎన్ని చిత్రహింసలు పెట్టినా, జైల్లో పెట్టినా భయపడకుండా వీరోచితంగా పోరాడుతున్నరు. ఏం తప్పు చేశారు ఉట్కూర్ ప్రజలు.. తెలంగాణ సమాజమంతా ఇక్కడి హిందువులకు జరిగిన అన్యాయాన్ని వినాలి. సెప్టెంబర్ 3న బ్లాక్ డే గా ప్రకటిస్తున్నా. అధికారంలోకి వచ్చాక విజయోత్సవ సభలు నిర్వహిస్తాం’’ అని తెలిపారు బండి సంజయ్.
నిజాం కాలంలో రజాకార్లు చేసిన అరాచకాలు తెలుసని.. కానీ.. కేసీఆర్ పాలనలో పోలీసులు ఉట్కూర్ హిందువులను, మహిళలను రాచిరంపాన పెట్టారని విమర్శించారు. గణేష్ ఉత్సవాలు చేసుకోవాలంటే ప్రభుత్వం అనుమతి తీసుకోవాలా? అని ప్రశ్నించారు. ఇద్దరు ఎస్పీలు వెయ్యి మంది పోలీసులు ఉట్కూర్ లో దిగి ఒక్కో ఇంటికి ఐదుగురు పోలీసులొచ్చి హిందువుల ఇండ్లలోకి చొరబడి కాళ్లు, చేతులు విరగ్గొట్టారని ఆరోపించారు. రౌడీషీట్, కమ్యూనల్ షీట్ ఓపెన్ చేసి జైళ్లకు పంపారన్నారు.
‘‘టీఆర్ఎస్ నేతలారా.. మీరు హిందువు పుట్టక పుట్టలేదా? అకారణంగా చిత్రహింసలు పెట్టి రౌడీ షీట్ పెట్టి జైళ్లకు పంపుతారా.. థూ.. మీ బతుకు చెడ.. భైంసాలోనూ ఇదే దుస్థితి. హిందువుల ఇండ్లపై ఎంఐఎం గూండాలు దాడులు చేసి 21 ఇండ్లను తగులబెడితే నయా పైసా సాయం చేయలే. హిందువుల బైక్ లను తగలపెట్టారు. హిందువులు చేసుకున్న పిండి వంటల(సకినాలు)పై మూత్రం పోసి పైశాచిక ఆనందం పొందారు. అయినా పోలీసులు పట్టించుకోకుండా హిందువులపై తిరిగి దాడులు చేశారు. చాలా మంది పోలీసుల బాధలు తాళలేక కోమాలోకి వెళ్లారు. బీహార్ లో 10 శాతం ముస్లిం ఓట్లుంటే ఎంఐఎం 5 సీట్లు గెలిచింది. 80 శాతమున్న హిందువులంతా ఓటు బ్యాంకుగా మారితే గోల్కొడపై కాషాయ జెండా ఎగరుతుంది. తప్పకుండా హిందూ రాజ్యంగా మారుస్తాం. హిందువులపై దేశవ్యాప్తంగా జరుగుతున్న దాడులను బీజేపీ మరిచిపోయే ప్రసక్తే లేదు. తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటాం. ఇలాంటి గూండాలపైనా, వారికి మద్దతిస్తున్న పోలీసులను దోషిగా నిలబెడతాం. గాయపడ్డ తమ్ముళ్లకు ఉద్యోగాలిప్పించే బాధ్యత తీసుకుంటా. తెలంగాణ చరిత్రలో ఉట్కూర్, భైంసా తమ్ముళ్ల వీరోచిత పోరాటాలు నిలిచిపోయేలా చేస్తాం. ఉట్కూర్ అభివృద్ధి కోసం నా ఎంపీ లాడ్స్స్ నుండి రూ.5 లక్షలు ప్రకటిస్తున్నా. అట్లాగే ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు సైతం ఎంపీ లాడ్స్ నుండి మరో రూ.5 లక్షలు ప్రకటించారు. ఇది ఉడతా సాయం మాత్రమే. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఈ ప్రాంతాన్ని అద్దంలా మెరిపించేలా అభివృద్ధి చేసి తీరుతాం’’ అని చెప్పారు సంజయ్.
ఇక ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఈనెల 5న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, 14న హోంమంత్రి అమిత్ షా వస్తున్నారని అన్నారు బండి. పాదయాత్రలో పాల్గొని సభలో మాట్లాడతారని చెప్పారు. తెలంగాణ వచ్చిందంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పెట్టిన భిక్షేనని… అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్న కేసీఆర్ కుమారుడు మంత్రి అయ్యాడంటే రాజ్యాంగం పెట్టిన భిక్షేనన్నారు. అధికారంలోకి వచ్చాక హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన ఘనుడు కేసీఆర్ అని… ఏ ఒక్క సామాజికవర్గ సమస్యలు పరిష్కరించలేదని విమర్శించారు. ఒక్క యువకుడికి ఉద్యోగం ఇవ్వని కేసీఆర్.. ఆయన కుటుంబంలో మాత్రం ఐదుగురికి ఉద్యోగాలిచ్చి నెలకు రూ.25 లక్షల జీతం తీసుకుంటున్నారని చెప్పారు. ‘‘వందలాది పేదల బలిదానాలతోనే తెలంగాణ ఏర్పడింది. తెలంగాణ వచ్చాక కేసీఆర్ కుటుంబం దోచుకుంటోంది. గరీబోళ్లు అల్లాడుతున్నరు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పేదలను ఆదుకునేందుకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. రేషన్ బియ్యం సహా గ్రామాల్లో అమలవుతున్న అభివృద్ధి పథకాలన్నీ కేంద్రం ఇస్తున్న నిధులతో చేపడుతున్నవే. బీజేపీ ఈ విషయాలన్నీ వివరిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తుంటే.. కేసీఆర్ భయపడుతున్నారు. బీజేపీని ఎదుర్కొనే దమ్ములేక కాంగ్రెస్, ఎంఐఎంతో కుమ్కక్కయ్యారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలన్నీ గుంట నక్కల పార్టీలు.. మా నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని బీజేపీ సింహంలా సింగిల్ గానే పోటీ చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తాం. గరీబోళ్ల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుతాం’’ అని అన్నారు బండి సంజయ్.