- ముదురుతోన్న ఐఐటీ విద్యార్థుల ఆందోళన
- సమస్యల పరిష్కారం కోసం కేసీఆర్ కు బండి లేఖ
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. 12 డిమాండ్ల పరిష్కారానికి విద్యార్థులు ఆందోళన చేపడుతుండగా పలు దఫాలుగా అధికారులు, ప్రజా ప్రతినిధులు వారితో చర్చలు జరిపారు. అయినా డిమాండ్ల పరిష్కారానికి స్పష్టమైన హామీ రాకపోవడంతో సోమవారం ఏడో రోజు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. మరోవైపు బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థుల సమస్యలను తక్షణం పరిష్కారించాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్కు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు.
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల న్యాయమైన సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిరోచక్రవర్తి గా వ్యవహరిస్తున్నారని బండి ఫైరయ్యారు. విద్యార్థుల న్యాయమైన 12 డిమాండ్లను వెంటనే ఆమోదించి వాటిని పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
మరోవైపు కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటుపై సంజయ్ విమర్శలు గుప్పించారు. పొలిటికల్ స్ట్రాటజిస్టులతో, తెలంగాణ ద్రోహులతో సమావేశం కావడానికి మీకు సమయం ఉంటుంది, కానీ గత 6 రోజులుగా తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థుల సమస్యల పరిష్కారానికి మాత్రం సమయం లేదా అంటూ కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ విదేశీ పర్యటనకు, కేసీఆర్ వ్యక్తిగత ప్రచారం కోసం కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని ఖర్చుచేస్తారు.. కానీ, ఉన్నత విద్యకు, విద్యార్థుల న్యాయమైన కోరికల పరిష్కారం కోసం నిధుల కేటాయించడానికి మాత్రం నిధులుండవా అని ప్రశ్నించారు.
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల డిమాండ్లను సిల్లీ డిమాండ్లుగా పేర్కొన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు బండి. మంత్రులు, అధికారులు, విద్యార్థులతో మైండ్ గేమ్ ఆడటం మానుకోవాలని హితవు పలికారు. గోబల్స్కు వారసులైన రాష్ట్రమంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, సబితాఇంద్రారెడ్డి విద్యార్థుల సమస్య పరిష్కారమైందని తప్పుడు ప్రచారం చేయడం రాష్ట్రప్రభుత్వం దివాళకోరుతనానికి నిదర్శనమన్నారు.
మరోవైపు మంత్రులు, అధికారులు, పోలీసులు.. విద్యార్థులను, వారి తల్లిదండ్రులను వేధింపులకు గురిచేస్తున్నారంటూ సంజయ్ ఆరోపించారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడమే కాకుండా.. అన్ని విద్యార్థిసంఘాలతో ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.