రాష్ట్రంలో రైతుల సమస్యలను వివరిస్తూ సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. 2018 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం లక్ష రూపాయల రుణమాఫీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రుణమాఫీ కింద ఇవ్వాల్సిన రూ.27,500 కోట్ల నిధులను విడుదల చేయాలన్నారు.
వరి పంట వేయొద్దని ఇచ్చిన ప్రకటనను వెంటనే ఉపసంహరించుకోవాలని లేఖలో పేర్కొన్నారు బండి సంజయ్. ప్రధాన మంత్రి ఫసల్ బీమా పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా సొమ్ము రూ.413.50 కోట్లను చెల్లించి రైతులను ఆదుకోవాలన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలన్నీ టీఆర్ఎస్ ప్రభుత్వ హత్యలేనని విమర్శించారు.
రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తానన్న హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు బండి. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించి.. రైతులను దళారీల నుండి రక్షించాలన్నారు. ధరణిలో జరుగుతున్న అక్రమాలను అరికట్టాలి సూచించారు. రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను వెంటనే మంజూరు చేయాలని చెప్పారు. రాష్ట్రంలోని రైతులకు అండగా ఉండి.. వారి తరఫున బీజేపీ పోరాటం చేస్తుందని లేఖలో వివరించారు బండి సంజయ్.