రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ద మేఘాలు కమ్ముకోవడంతో స్వదేశానికి వచ్చేందుకు సిద్ధమైన భారతీయులు ఎయిర్ పోర్టులోనే చిక్కుకుపోయారు. యుద్ధం నేపథ్యంలో విదేశీయులంతా దేశాన్ని విడిచి వెళ్లాలని ఉక్రెయిన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో భారతీయులు ఇక్కడకు వచ్చేందుకు టికెట్స్ బుక్ చేసుకున్నారు. త్వరగా అక్కడ నుంచి బయటపడాలని ఎయిర్ పోర్టుకు వచ్చారు. సరిగ్గా అదే సమయంలో ఎయిర్ పోర్టును మూసివేసింది ఉక్రెయిన్ ప్రభుత్వం.
అటు స్వదేశం రాలేక, ఇటు యూనివర్శిటీకి వెళ్లలేక దాదాపు 20 మంది విద్యార్థులు ఎయిర్ పోర్టులోనే చిక్కుకుపోయారు. వారిలో కరీంనగర్ కు చెందిన మెడికల్ విద్యార్థి కడారి సుమాంజలితోపాటు తెలంగాణకు చెందిన రమ్యశ్రీ, ఎన్.శ్రీనిధి, లిఖిత ఉన్నారు. వారంతా ఉక్రెయిన్ లోని జాఫ్రోజియా మెడికల్ యూనివర్శిటీలో వైద్య విద్యను అభ్యసిస్తున్నారు.
తాము ఎయిర్ పోర్టులో చిక్కుకుపోయామని సుమాంజలి తన సోదరుడు స్వామికి ఫోన్ చేసి వివరించింది. తమను ఎటూ వెళ్లనీయడం లేదని వాపోయింది. దీంతో స్వామి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ను కలిసి తమ సోదరితోపాటు ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయులు పడుతున్న బాధలను వివరించారు.
దీనిపై తక్షణమే స్పందించిన బండి సంజయ్ విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి కార్యాలయానికి ఫోన్ చేశారు. ఉక్రెయిన్ లో చిక్కుక్కుపోయిన వారందరినీ స్వదేశానికి రప్పించాలని కోరుతూ లేఖ కూడా పంపారు. బండి సంజయ్ లేఖతో విదేశాంగ శాఖ మంత్రి కార్యాలయ అధికారులు ఉక్రెయిన్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు.