కరోనా వైరస్ కారణంగా ప్రజలు రాకపోకలకు దూరం అయ్యారు. కోవిడ్ థర్డ్ వేవ్ నేపథ్యంలో బెంగళూరు కెంపేగౌడ విమానాశ్రయం నుంచి విదేశాలకు వెళ్లాలన్నా.. రావాలన్నా అక్కడి ల్యాబ్ లో ర్యాపిడ్ ఆర్టీపీసీఆర్ టెస్టులు తప్పనిసరి చేశారు అధికారులు. అయితే.. ఈ టెస్టులు చేసే సిబ్బంది ఇష్టానుసారంగా రిపోర్టులు ఇస్తున్నారని మొదటి నుండి ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి ఘటనే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
దుబాయ్ కి వెళ్లాల్సిన ఒక యువకుడు కరోనా టెస్టు చేయించుకున్నాడు. నెగెటివ్ గా తెలిన దృవపత్రాన్ని తీసుకొని కెంపేగౌడ ఎయిర్ పోర్టుకి వెళ్లాడు. కానీ అక్కడ అధికారులు మళ్లీ పరీక్షలు చేయించారు. అక్కడ అతనికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అయితే.. ఆ యువకుడు మళ్లీ బయట టెస్టుకు వెళ్లాడు. బయట చేయించిన టెస్ట్ లో నెగెటివ్ గా తేలింది.
దీంతో ఆ యువకుడు తన కుటుంబ సభ్యులతో ఎయిర్ పోర్టుకు వచ్చి తనకు టెస్టు చేసిన సిబ్బందిని నిలదీశాడు. ఆ సమయంలో సిబ్బంది మద్యం మత్తులో ఉండడంతో గొడవ పెరిగింది. తప్పుడు నివేదిక వల్ల దుబాయ్ కి వెళ్లలేకపోయానని ఆ ప్రయాణికుడు ఆందోళనకు దిగాడు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఆ నష్టాన్ని ఎవరు తీరుస్తారని బాధిత యువకుడు వాపోయాడు. ఈ గొడవ వీడియోలు వైరల్ అయ్యాయి. కాగా.. అడిగినంత డబ్బులను ముట్టజెబితే ల్యాబ్ సిబ్బంది ఎలా కావాలంటే అలా నివేదిక ఇస్తారని ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి వారితో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపణలు ఉన్నాయి.