ఈ మధ్య కాలంలో బ్యాంకు సిబ్బంది దౌర్జన్యాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. మొన్నటికి మొన్న మహబూబాబాద్ లో రైతు బ్యాంకు రుణం చెల్లించలేదని ఇంటి తలుపులు ఎత్తుకెళ్లిన ఘటన మరువక ముందే తాజాగా కామారెడ్డిలో కూడా అలాంటి ఘటనే చోటు చేసుకుంది. తలుపులుతో పాటు రైతు కుమారుల ల్యాప్ టాప్ లు, ఇంట్లో కొంత సామాను ఎత్తుకెళ్లారు.
నస్సుల్లాబాద్ మండలం అంకోల్కు చెందిన చంచు హన్మాండ్లు దుర్కి, పసుపుల లక్ష్మణ్, పసుపుల సాయయ్య అనే రైతులు స్థానిక సహకార కేంద్ర బ్యాంకులో లోన్లు తీసుకున్నారు. చంచు హన్మాండ్లు అనే రైతు రూ.5 లక్షల రుణం తీసుకోగా.. ఈఎంఐ రూపంలో చెల్లిస్తూ వస్తున్నాడు. అయితే మరో 6 వాయిదాలు చెల్లించాల్సి ఉండగా.. గత కొంతకాలంగా టైమ్కు కట్టడం లేదని తెలుస్తోంది. దీంతో హన్మాండ్లు ఇంటికి వచ్చిన బ్యాంకు అధికారులు, సిబ్బం..ది లోన్ కట్టాల్సిందిగా ఆయనపై ఒత్తిడి తెచ్చారు.
తన దగ్గర ఇప్పుడు డబ్బులు లేవని, త్వరలో కడతానంటూ అధికారులను వేడుకున్నాడు. అయినా వినిపించుకోని సిబ్బంది.. ఇంటి తలుపులు తొలగించారు. అలాగే సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. చాలాసేపు వేడుకోగా తలుపులు, సామాగ్రి తిరిగి ఇచ్చేశారు. మంగళవారం వరకు టైమ్ ఇస్తున్నామని, కట్టకపోతే తలుపులు, సామాన్లు అన్నీ తీసుకెళ్లతామని హెచ్చరించి వెళ్లారు.
ఇక పసుపుల సాయయ్య అనే రైతు ఇంట్లో ఆయన కుమారుడికి చెందిన బైక్ను కూడా స్వాధీనం చేశారు. అలాగే పసుపుల లక్ష్మణ్ ఇంట్లో ఆయన కుమారుడి ల్యాప్టాప్ను తీసుకున్నారు. అయితే గంట తర్వాత ఒకరు రూ.50 వేలు, మరొక రైతు రూ.20 వేలు చెల్లించడంతో ల్యాప్టాప్, బైక్ తిరిగి ఇచ్చేశారు. లోన్లు చెల్లించడంలేదని బ్యాంకు అధికారులు దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. రైతుల ఇళ్లల్లోని తలుపులు, సామాన్లు ఎత్తుకెళ్లిపోతున్నారు. ఇటీవల కూడా ఓ రైతు ఇంట్లో తలుపులు, సామాన్లు తీసుకెళ్లారు.