బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు చేపట్టిన ఆందోళన మూడోరోజు విద్యార్ధులు కొనసాగిస్తున్నారు. డిమాండ్లు పరిష్కరించాలని.. వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా గొడుగులు పట్టుకుని యూనివర్సిటీ రెండో గేటు వద్ద నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రధానమైన 12 సమస్యలను పరిష్కరించాలని విద్యార్ధులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులకు మద్దతుగా వచ్చిన కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్ కు తరలించారు.
నిర్మల్ కలెక్టర్ ముషరఫ్ అలీ.. కొందరు విద్యార్థులతో చర్చలు జరిపారు. మంత్రి సబితారెడ్డితో మాట్లాడించారు. ప్రస్తుతం విద్యార్థులు చెప్తున్న 12 డిమాండ్లలో రెండు, మూడు తక్షణమే పరిష్కరిస్తామని.. మిగితావి ఇప్పట్లో చేయలేమని చెప్పారు. అందుకు విద్యార్ధలు అంగీకరించలేదని.. సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారం చూపాలని పట్టు పట్టినట్టు తెలుస్తోంది.
సీఎం లేదా మంత్రి కేటీఆర్ వచ్చేదాకా తాము వెనకడుగు వేసేది లేదని స్పష్టంచేశారు విద్యార్ధులు. వందలమంది విద్యార్థులు ‘విజిట్ ఆర్జీయూకేటీ-కన్సిడర్ ఆర్జీయూకేటీ హ్యాష్ ట్యాగ్ లతో వేల ట్వీట్లు చేశారు. విద్యార్థుల ట్వీట్లకు స్పందించిన కేటీఆర్.. సమస్యలను సీఎం కేసీఆర్, విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.
Advertisements
రాష్ట్రంలో నాణ్యమైన విద్యను అందించేందుకు ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొంటామని పేర్కొన్నారు కేటీఆర్. విద్యార్ధలు సమస్యలు ఎలాంటివైనా పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామని పేర్కొంటూ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ట్యాగ్ చేశారు కేటీఆర్.