ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో దివంగత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఫోటో లేకపోవడం శోచనీయమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అట్టడుగు వర్గాలు, బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో వెలుగు నింపి.. విప్లవాత్మక మార్పుకు కృషి చేసిన ఎన్టీఆర్.. యావత్ తెలుగు జాతికే గర్వకారణమని కొనియాడారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన మహనీయుల ఫోటోలు లేకుండా ఆజాదీ కా అమృత్ మహోత్సవం చేపట్టడం సిగ్గుచేటని విరుచుకుపడ్డారు.
కేంద్ర వైఖరిని ఖండిస్తూ హైదరాబాద్ సాలార్ జంగ్ మ్యూజియంలో నిరసన ప్రదర్శన చేపట్టామని.. కాంగ్రెస్ నేతలను అక్రమంగా అరెస్ట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. చదువులేని వారి చేతుల్లో దేశాన్ని పెడితే ఇలాగే ఉంటుందని మండిపడ్డారు.
అదే విధంగా.. జూన్ 12న ఆర్ఆర్బీ, టెట్ పరీక్షలు రెండూ ఉండటంతో అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. టెట్ పరీక్ష వాయిదా వేయాలని వినతి పత్రం అందించడానికి మంత్రి సబిత ఇంటికి వెళ్లిన విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేయడాన్ని ఆయన ఖండించారు. ప్రజా సమస్యలపై పోరాడితే అరెస్టు చేస్తారా అని మండిపడ్డారు. ఒకే సారి రెండు పరీక్షలు నిర్వహిస్తే ఎలా రాస్తారని ప్రశ్నించారు భట్టి.