సోషల్ మీడియాలో సెలబ్రిటీల మీద ట్రోలింగ్ చేసే వారు ఎక్కువైపోయారు. మరి ముఖ్యంగా టీమిండియా క్రికెటర్లు, వారి భార్యలు, పిల్లల మీద అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ చాలా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అలాంటి వారికి ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మాలివాల్ గట్టి వార్నింగ్ ఇచ్చారు.
ఇక మీదట అయిన బుద్ది మార్చుకోకపోతే అలాంటి వారందరూ జైలుకెళ్లేందుకు సిద్దంగా ఉండాలని హెచ్చరించారు.ఇటీవలికాలంలో సెలబ్రిటీలు, వారి కుటుంబసభ్యులను లక్ష్యంగా చేసుకొని వాళ్లపై వివాదాస్పద, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం ఎక్కువైపోయిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేేశారు.
చిన్న పిల్లలని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడుతూ సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.
కొన్నాళ్ల క్రితం భారత క్రికెటర్లు విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీల కుమార్తెలపై ట్రోలర్స్ చేసిన అభ్యంతరకరమైన ట్వీట్లపై ఢిల్లీ కమిషన్ ఇటీవలే ఢిల్లీ పోలీసులకు నోటీసులకు జారీ చేసింది.
నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. సోషల్ మీడియాలో ఎవరైనా మహిళల్ని బెదిరించినా ఎవరూ భయపడకుండా ఢిల్లీ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేయవచ్చని స్వాతి మాలివాల్ స్పష్టం చేశారు. దీంతో పాటు 181, 112 హెల్ప్ లైన్ నెంబర్ ద్వారా కూడా కంప్లైంట్ చేయవచ్చని చెప్పారు. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్, వెబ్ సైట్ లో ఫిర్యాదు చేసినా స్పందిస్తామని చెప్పారు.