హిమాచల్ ప్రదేశ్ను మెడికల్ టూరిజంకు అడ్డాగా మారుస్తామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. హిమాచల్ ప్రదేశ్లో ఆయన ఈ రోజు పర్యటిస్తున్నారు. దసర రోజు ఆయన హిమాచల్ ప్రదేశ్ లో చాలా బిజీగా గడిపారు. బిలాస్ పూర్లో ఎయిమ్స్ను ఆయన ప్రారంభించారు.
రాష్ట్రంలో మొత్తం 3 వేల 650 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు. బిలాస్ పూర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బిలాస్ పూర్ ఎయిమ్స్ను గ్రీన్ ఎయిమ్స్ గా తీర్చిదిద్దుతామన్నారు.
ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసి గత ప్రభుత్వాలు మరిచిపోయాయన్నారు. కానీ తమ ప్రభుత్వం వచ్చాక ప్రాజెక్టులను పూర్తిచేశామన్నారు. కేంద్రం, రాష్ట్రంలో బీజేపీకి ప్రజలు పట్టం కట్టడంతోనే హిమాచల్ ప్రదేశ్ లో అభివృద్ధి సాధ్యమైందని పేర్కొన్నారు.
అనంతరం కులులో నిర్వహించిన దసరా రథయాత్రలో ఆయన పాల్గొన్నారు. భగవాన్ రఘునాథ్ జీ రథాన్ని ఆయన సందర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని వెంట హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఉన్నారు.