దసరా మొదటి రోజున అమ్మవారిని బంగారపు ఆభరణాలతో అలంకరించి ఆమెను స్వర్ణ కవచాలంకృతగా పూజిస్తున్నారు. ఈ అలంకారంలో ఉన్న అమ్మవారిని చూసినా, పూజించినా… ఇంట్లో ఉన్న దారిద్ర్యమంతా తీరిపోతుందట.
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దేవీ నవరాత్రుల శోభ దేదీప్యమానంగా కనిపిస్తోంది. కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం స్నపనాభిషేకంతో ప్రారంభమయ్యాయి. 10 రోజుల పాటు పది అలంకారాల్లో కనక దుర్గమ్మ భక్తులకు దర్శనమివ్వనున్నారు. తొలిరోజు కావడంతో తెల్లవారుజామునుంచే పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. తొమ్మిదిరోజులపాటు భక్తులు నవరత్నమాలను వేసుకుంటారు. వారంతా అమ్మవారి సమక్షంలో మాలధారణ స్వీకరించారు. దీనినే భవానీ దీక్ష అంటారు. కాగా ఇంద్రకీలాద్రిపై భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. దసరా ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ఆర్జిత సేవలను అధికారులు రద్దు చేశారు.
తెలుగు రాష్ట్రాలలో అమ్మవారు అంటే విజయవాడ కనకదుర్గమ్మే! మొదటి రోజు ‘స్వర్ణ కవచాలంకృత దేవి’గా అలంకరించడం వెనుక కూడా ఓ కథ చెబుతారు.
పూర్వం విజయవాడని విజయవాటిక అని పిలిచేవారు. అర్జునుడు ఇక్కడ శివుని కోసం ఘోరమైన తపస్సు చేశాడు. అర్జునుడి తపస్సుకి మెచ్చిన శివుడు తన పాశుపతాస్త్రాన్ని ఇచ్చాడు. అందుకనే ఈ ప్రాంతానికి విజయవాటిక అన్న పేరు వచ్చింది.
ఒకప్పుడు ఈ విజయవాటికను మాధవవర్మ అనే రాజు పాలించేవాడు. అతను గొప్ప దేవీ భక్తుడు. మాధవవర్మ పాలనలో రాజ్యంలో ప్రజలు చాలా సంతోషంగా ఉండేవారు. ధర్మం నాలుగు పాదాలా నడిచేది. అలాంటి సమయంలో ఒక దుర్ఘటన జరిగింది. మాధవవర్మ కుమారుడు ఒకసారి రథం మీద తిరుగుతుందగా, ఆ రథం కింద పడి ఓ బాలుడు చనిపోయాడు. పొరపాటున జరిగినా కూడా అమాయకుడైన ఓ పిల్లవాడి ప్రాణాలను బలిగొన్నందుకు రాజుగారు విచారించారు. తన కొడుకని కూడా చూడకుండా మరణశిక్ష విధించారు.
మాధవవర్మ నిజాయితీకి అమ్మవారు చాలా సంతోషించారు. ఆ రాజ్యం అంతా బంగారు వర్షాన్ని కురిపించారు. అప్పటి నుంచి అమ్మవారిని కనకదుర్గగా పిలుస్తున్నారు. ఆవిడ అనుగ్రహంతో ఏ ఇంట్లో అయినా సిరుల వర్షం కురుస్తుందని నమ్ముతున్నారు.