▶ అత్యంత దయనీయ పరిస్థితుల్లో ప్రభుత్వ ఆసుపత్రులు
▶ పడక ఎక్కిన 500 పడకల కరీంనగర్ పెద్దాసుపత్రి
▶ చిన్నపిల్లల వార్డులో బెడ్స్, బెడ్ షీట్స్ కరవు
▶ మడత మంచాల్లో రోగులకు చికిత్స
▶ సమీక్ష చేయని వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్
▶ రాజకీయ అస్థిరతలో ఆసుపత్రులను పట్టించుకోని మంత్రి రాజేందర్
కరీంనగర్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు తన కుటుంబ సంక్షేమమే తప్ప ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు తీవ్ర స్థాయిలో విమర్శించారు. కరీంనగర్ జిల్లా కేంద్ర ప్రధాన ఆసుపత్రిని మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ టి. జీవన్రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఇతర సీనియర్ నాయకులతో కలిసి పరిశీలించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం ఆరేళ్లుగా ప్రభుత్వ ఆసుపత్రులను భయంకరంగా నిర్వీర్యం చేసిందని దుయ్యబట్టారు. ప్రభుత్వ ఆసుపత్రులకు అదనంగా కొత్తగా ఒక్క భవనం నిర్మించలేదని అన్నారు. కొత్తగా ఈక్విప్మెంట్ ఇవ్వడంగానీ, మందులు సక్రమంగా సరఫరా చేయడం కానీ చేయలేదని భట్టి ఆగ్రహం వ్యక్తంచేశారు. చివరకు బెడ్ షీట్స్ కూడా సరిగ్గా అందించక పోవడం దురదృష్టకరమని అన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఉన్న బెడ్స్ సరిపోక మడత మంచాలు వేయాల్సిన దుస్థితి ఉన్నదని ఆయన అన్నారు.
వైద్యులు ఎక్కడ?
కరీంనగర్ జిల్లా ప్రధాన ఆసుపత్రిలో 350 పడకలు ఉన్నాయని ఆయన చెప్పారు. దీనికి అదనంగా మాత, శిశు సంక్షేమం కింద అదనంగా 150 పడకలను గత కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసింది. దీనితో మొత్తం ఆసుపత్రిలో పడకల సంఖ్య 500కు చేరింది. ఇందులో కేవలం 200 పడకల ఆసుపత్రిలో ఉండే సిబ్బంది మాత్రమే ఉన్నారని భట్టి అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇదే నిదర్శనం అని భట్టి అన్నారు. సివిల్ సర్జన్స్ 28 మంది ఉండాలని, నలుగురు మాత్రమే ఉన్నారని చెప్పారు. అలాగే 109 మంది నర్సులు ఉండాల్సి ఉండగా కేవలం 61 మంది మాత్రమే ఉన్నారని చెప్పారు. ఇక 13 మంది లాబ్ టెక్నీషియన్స్ ఉండాల్సి ఉండగా కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారని అన్నారు.
మహిళలకు పురుషులతో ఈసీజీ టెస్టులా?
మహిళా రోగులకు పురుషులతో ఈసీజీ పరీక్షలు నిర్వహించే అత్యంత దురదృష్టకర పరిస్థితులు కరీంనగర్ పెద్దాసుపత్రిలో ఉన్నాయని భట్టి వివరించారు. మేల్ టెక్నీషియన్స్తో ఈసీజీ పరీక్షలు చేయించుకోలేక మహిళలు బయటకు వెళుతున్నారని, ఇది అత్యంత బాధాకరమని భట్టి అన్నారు. ఇక శానిటేషన్ కు సంబంధించిన స్టాఫ్ కూడా ఎవ్వరు లేరని చెప్పారు.
ఆరోగ్యమంత్రి ఆసుపత్రులు పట్టించుకోడు..
కరీంనగర్ జిల్లాకు చెందిన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రస్తుతం ఆసుపత్రిలో నెలకొన్న పరిస్థితులపై కనీసం సమీక్ష కూడా చేయలేదని భట్టి విమర్శించారు. మందులు లేవు, బెడ్ షీట్స్ లేవు, మంచాలు లేవు, కావాల్సిన స్థాయిలో వైద్యులు, ఇతర సిబ్బంది లేరని.. అసలు ఆరోగ్య, వైద్య శాఖ మంత్రి వీటిని చూస్తున్నారా అన్న అనుమానం కలుగుతోందని అన్నారు. వైద్య మంత్రి తన పదవి పోతుందనే భయంతో ఆందోళనలతో శాఖను మర్చిపోయినట్టు ఉన్నదని అన్నారు. ఈ కారణం వల్లే తెలంగాణ రాష్ట్రం జ్వరాల బారిన పడి ఉందని అన్నారు. ఈటల రాజేందర్ కు ఆ పార్టీ అధినాయకత్వానికి వాటాల పంపకంలో వచ్చిన తేడాలకు మాకు సంబంధం లేదు.. మీరు రూ. 5 వేలు లంచం కూడా తీసుకోలేదు అని చెబుతున్నారు.. ఆది మీకు.. మీ నాయకత్వం తల్చుకోవాల్సిన విషయం.. కానీ అవినీతి మాత్రం జరిగిందని.. మీ నాయకులు ప్రశ్నించడంతో మీరు మనస్తాపం చెందారని భట్టి చెప్పారు. మొత్తం అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.
కేసీఆర్కు తన కుటుంబ సంక్షేమమే…
ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుటుంబ సంక్షేమం మాత్రమే చూసుకుంటున్నారని, ప్రజల సంక్షేమం మరిచిపోయారని భట్టి అన్నారు.