సినిమా టిక్కెట్ల బుకింగ్ విషయంలో… ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఛార్జీల పేరుతో అదనంగా డబ్బులు వసూలు చేస్తున్న బుక్ మై షో, పీవీఆర్ సినిమాస్కు జిల్లా వినియోగదారుల ఫోరం షాక్ ఇచ్చింది. సినిమా టిక్కెట్ ధరపై అదనంగా డబ్బులు వసూలు చేయడాన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్కు చెందిన సామాజిక కార్యకర్త విజయ్ గోపాల్ 2019 జనవరిలో పిటిషన్ వేశారు. అన్ని ఆధారాలు పరిశీలించిన జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ తుది తీర్పునిచ్చింది.
విజయ్ గోపాల్ పీవీఆర్ సినిమాస్లో సినిమా చూసేందుకు బుక్ మై షో ద్వారా టికెట్ బుక్ చేశారు. ఈ సమయంలో ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ చార్జి పేరుతో అదనంగా 41.78 వసూలు చేయడంతో అవాక్కయ్యారు. టిక్కెట్ ధరపై దాదాపు 18శాతం ఛార్జ్ వసూలు చేయడంపై ఆయన జిల్లా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. దీనిపై వివరణ అందించిన బుక్ మై షో సంస్థ.. ఫిర్యాదుదారుడు చెప్పినవి నిరాధారమంటూ తెలుపుతూ కేసును కొట్టివేయాలని కమిషన్ను కోరింది. విచారణ జరిపిన జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్-3 అధ్యక్షుడు నిమ్మ నారాయణ, సభ్యురాలు సీ.లక్ష్మీప్రసన్నతో కూడిన బెంచ్ ఫిర్యాదుదారుడి వాదనలతో ఏకీభవించింది.
ఈ కేసులో విజయ్గోపాల్కు 25వేలు పరిహారం, కేసు ఖర్చుల కింద మరో 1000 రూపాయలు చెల్లించాలంటూ తీర్పునిచ్చింది. 5వేలు లీగల్ ఎయిడ్ కింద కోర్టుకు చెల్లించాలని బుక్ మై షో, పీవీఆర్ సినిమాస్ను ఆదేశించింది. 45 రోజుల వ్యవధిలో ఈ డబ్బులు చెల్లించాలని, లేకపోతే తీర్పు వెలువడిన కాలం నుంచి 18శాతం వడ్డీతో చెల్లించాల్సి ఉంటుందని కమిషన్ హెచ్చరించింది.