అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో తెలియదు. సాధారణ డ్రైవర్ రాత్రికి రాత్రే కోటిశ్వరుడు అవుతాడని ఎవరు ఊహించలేరు. అయితే, ఓ డ్రైవర్కి మాత్రం అదృష్టం ఐపీఎల్ బెట్టింగ్ రూపంలో వరించింది. రాత్రికి రాత్రే అతడిని కోటిశ్వరుడిని చేసింది. ఈ ఘటన బిహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.
బిహార్ రాష్ట్రంలోని శారన్ జిల్లా రసూల్పుర్కు చెందిన రమేశ్ కుమార్ డ్రైవర్గా జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే, ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తోండటంతో.. ఆన్లైన్ బెట్టింగ్ వేదిక డ్రీమ్11లో బెట్టింగ్ వేశాడు. ఇందులో అదృష్టం కొద్దీ రూ.2 కోట్లు గెలిచి రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు. దీంతో అతడి ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది.
ఈ సందర్భంగా రమేశ్ కుమార్ మాట్లాడుతూ.. ‘ఆరంభంలో నేను రూ.49 పెట్టి ఆడేవాడిని. కొన్నిసార్లు గెలిచేవాడిని. మరికొన్ని సార్లు నిరాశే ఎదురయ్యేది. ఇటీవలే పంజాబ్, లఖ్నో మధ్య మ్యాచ్లో పంజాబ్ను ఎంచుకున్నా. రూ.59కి కెప్టెన్గా కగిసో రబాడా, వైస్ కెప్టెన్గా శిఖర్ ధావన్ను ఎంచుకున్నా.’ అని చెప్పుకొచ్చాడు.
అదృష్టం కొద్దీ ఆ మ్యాచ్లో రబాడా 3 వికెట్లు తీశాడు. అతడు ఎంపిక చేసుకున్న ఇతర క్రికెటర్లు కూడా బాగా ఆడటం వల్ల దేశ స్థాయిలో అతడికి మంచి పాయింట్లు లభించాయి. మ్యాచ్ జరిగిన తెల్లారి అతడు నెం.1 స్థానంలో నిలిచి, రూ.2 కోట్లు గెలుచుకున్నట్లు అతడికి సందేశం వచ్చింది. జీఎస్టీ చెల్లింపుల అనంతరం అతడి ఖాతాలో రూ.1.4 కోట్లు వచ్చి చేరాయి.
ఈ డబ్బు రమేశ్ కుమార్ జీవితాన్ని ఒక్కసారిగా మార్చేంది. అతడి తండ్రి రోజూ కూలీగా పనిచేస్తున్నాడు. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు కావడాన్ని రమేశ్ నమ్మలేకపోతున్నాడు. ఈ డబ్బుని తన పిల్లల చదువులకు, సమాజ శ్రేయస్సు కోసం వాడతానని తెలిపాడు.