ఈరోజుల్లో డిగ్రీలు, పీజీలు చేసిన వాళ్లు పెద్ద పెద్ద ఎమ్మెన్సీ కంపెనీల్లో ఉద్యోగాలు వదులుకుని మరి స్టార్టప్ లు మొదలు పెట్టి ఎంతో మందికి ఉపాధి కూడా కల్పిస్తున్నారు. చాలా మంది అయితే మంచి సెంటర్ చూసుకొని టీ కొట్టు పెట్టుకుంటున్నారు.
‘బీటెక్ చాయ్’, ‘చాయ్ పాయింట్’, ‘ఎంబీఏ చాయ్వాలా’, ‘చాయ్ మేకర్స్’ ఇలా రకరకాల పేర్లతో ఔట్లెట్స్ తెరుస్తున్నారు. తాజాగా ఇంజినీరింగ్ చదువుతున్న ఓ విద్యార్థిని కూడా ఇదే తరహాలో టీ స్టాల్ను ప్రారంభించి అందరి నుంచి ప్రశంసలు అందుకుంటోంది.
బీహార్కు చెందిన వర్తికా సింగ్ అనే యువతి బీటెక్ చదువుతోంది. కానీ ఆమె కల మాత్రం టీ స్టాల్ పెట్టుకోవడమే. బీటెక్ పూర్తి చేసి.. జాబ్ కోసం ఎదురు చూసేంత ఓపిక ఆమెకు లేదు. దీంతో చదువుతూనే.. తన కల సాకారం చేసుకోవాలనుకుంది. ఈ క్రమంలోనే ఫరీదాబాద్లోని గ్రీన్ ఫీల్డ్ ప్రాంతంలో ‘బీ టెక్ చాయ్ వాలీ’ పేరుతో స్టార్టప్ మొదలు పెట్టి తన కలను సాకారం చేసుకుంది.
ఈ టీ స్టాల్లో రకరకాల చాయ్లను తక్కువ ధరలకే ప్రజలు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్టాల్ సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఇందుకు సంబంధించిన వీడియోను swagsedoctorofficial ఇన్స్టా గ్రామ్ పేజీలో పోస్టు చేశారు. వర్తికా సింగ్ వద్ద టీ చాలా విభిన్నంగా ఉంటుందని తెలిపారు.
మసాలా అండ్ లెమన్ టీ అందుబాటులో ఉంటుందని… రెగ్యులర్ టీ రూ.10, స్పెషల్ టీ రూ.20కి విక్రయిస్తున్నట్లు వివరించారు. ఇది చూసిన నెటిజన్లు వర్తికాను ప్రశంసిస్తున్నారు.‘‘ మీ పట్టుదల నచ్చింది.. మీరు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా’’.. ‘‘బీ టెక్ చాయ్ వాలీ’ సక్సెస్ అవ్వాలి’’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.