బిగ్బాస్ చరిత్రలోనే తొలిసారిగా మహిళ విజేతగా నిలిచింది. బుల్లితెరపై ఐదు సీజన్లు పూర్తిచేసుకున్న బిగ్బాస్ ఇప్పుడు ఓటీటీ వేదికగా నాన్ స్టాప్ అంటూ స్ట్రీమింగ్ అయింది. తాజాగా ఈ రియాల్టీ గేమ్ షో శనివారం గ్రాండ్ ఫినాలే అట్టహాసంగా జరిగింది. మొదటి నుంచి గట్టి పోటీనిస్తూ.. ఆడపులిగా పేరు తెచ్చుకున్న తెలుగమ్మాయి బిందుమాధవి.. బిగ్బాస్ టైటిల్ కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది.
ప్రతి టాస్కులలోనూ.. ప్రతీ సందర్భంలోనూ ఎదుటివారికి గట్టి పోటీనిస్తూ చివరకు ధైర్యంగా పోరాడింది. కంటెస్టెంట్ అఖిల్ నుంచి తీవ్ర స్తాయిలో పోటి వచ్చినప్పటికీ.. తన మాటతీరుతో, బుద్దిబలంతో బిగ్బాస్ టైటిల్ గెలిచుకుంది. అంతేకాదు రూ. 40 లక్షలు సొంతం చేసుకుంది. తన అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసులను దోచుకోవడమే కాకుండా.. బిగ్బాస్ చరిత్రలోనే తొలిసారి మహిళ విన్నర్గా నిలిచింది బిందు.
ఇక బిగ్బాస్ టైటిల్ గెలివాలని పోరాడిన అఖిల్ ఆశలు మరోసారి ఆవిరైపోయాయి..ఈసారి కూడా బిగ్బాస్ నాన్ స్టాప్ రన్నరప్గా నిలిచాడు. చివరకు ఏడుగురు కంటెస్టెంట్స్ మిగిలారు. అందులో బిందుమాధవి మొదటి స్థానంలో నిలవగా.. అఖిల్ రెండవ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అనిల్ రాథోడ్, మిత్రాశర్మ ముందుగానే ఎలిమినేట్ కాగా.. ఈ తర్వాత బాబా భాస్కర్ ఎలిమినేట్ అయ్యారు.
అనంతరం అరియానా రూ. 10 లక్షలు తీసుకుని బయటకు వచ్చేసింది. ఇక ఆ తర్వాత యాంకర్ శివ ఎలిమినేట్ అయిన తర్వాత బిందుమాధవి, అఖిల్ ఇద్దరూ బిగ్బాస్ స్టేజ్ పైకీ చేరుకున్నారు. బిగ్బాస్ ఇంట్లో వారి అనుభవాలు.. ఈ షోకు రావడానికి గల కారణాలను చెప్పమని నాగార్జున అడగ్గా.. తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు.. తెలుగు సినిమాల్లో మళ్లీ నటించేందుకు బిగ్బాస్ షోకు వచ్చినట్లు తెలిపింది బిందుమాధవి.