– వాయిదా పద్దతిలో జీతాలు
– నెలల తరబడి బిల్లుల పెండింగ్
– అప్పులు కుప్పగా రాష్ట్రం!
– సీఎంకు చిత్తశుద్ధి ఉంటే ఆర్థిక పరిస్థితిపై..
– శ్వేతపత్రం విడుదల చేయాలి
– బండి సంజయ్ డిమాండ్
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనా వైఫల్యం వల్ల రాష్ట్రంలో ఆర్దిక పరిస్థితి పూర్తిగా గాడి తప్పిందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. తెలంగాణ ధనిక రాష్ట్రం, మిగులు రాష్ట్రమని గొప్పలు చెబుతూ అప్పుల కుప్పగా మార్చి పూర్తిగా దివాలా తీయించారని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సకాలంలో జీతాలు కూడా ఇవ్వడం లేదని… రోజుకో జిల్లా చొప్పున వంతుల వారీగా జీతాలు చెల్లిస్తూ ప్రతి నెలా రెండోవారం దాకా సాగదీస్తున్నారని ఫైరయ్యారు.
ఉద్యోగుల, ఉపాధ్యాయుల, పెన్షనర్ల మెడికల్ రీయింబర్స్ మెంట్ ఇతర బిల్లులు గత 7 నెలలుగా పెండింగ్ లో ఉన్నాయన్నారు బండి. చివరకు 317 జీవో ద్వారా బదిలీ అయిన ఉపాధ్యాయులకు సంబంధించి జనవరి నెల వేతనం కూడా ఇంకా చెల్లించలేదంటే రాష్ట్ర ఆర్దిక పరిస్థితి ఏ దుస్థితిలో ఉందో అర్థం అవుతోందని చెప్పారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు జీపీఎఫ్ లో కూడబెట్టుకున్న డబ్బులను తమ పిల్లల ఉన్నత చదువుల కోసం, పెళ్లిళ్ల కోసం, కుటుంబ సభ్యులకు చికిత్స చేయించుకోవాలని ఆరాట పడుతుంటే వాటిని కూడా చెల్లించకపోవడం అత్యంత దురదృష్టకరన్నారు. జీపీఎఫ్ సొమ్ము డ్రా చేసుకునేందుకు వచ్చిన దరఖాస్తులను గత రెండేళ్లుగా ఎందుకు పెండింగ్ లో పెట్టారని ప్రశ్నించారు.
నిజంగా తెలంగాణ ధనిక రాష్ట్రం, మిగులు బడ్జెట్ కలిగిన రాష్ట్రమైతే ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు వేతనాలకు అంతగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు సంజయ్. వాయిదాల పద్దతిలో మాదిరిగా ఒక్కోరోజు ఒక్కో జిల్లాకు చొప్పున రెండోవారం దాకా జీతాలను చెల్లిస్తూ ఎందుకు సాగదీస్తున్నారని ప్రశ్నించారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు 2020 జులై తరువాత సమర్పించిన వేలాది పెండింగ్ బిల్లులను 2021 మార్చి 31 నాడు ప్రభుత్వం ఎందుకు తిరస్కరించిందో చెప్పాలన్నారు. ఆ తరువాత 2021 నుండి సమర్పించిన పెండింగ్ బిల్లులను కూడా ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా చెల్లించడం లేదని… మార్చి 31 లోపు పెండింగ్ బిల్లులు పాస్ కాకపోతే పరిస్థితి ఏంటని కడిగిపారేశారు.
ఉద్యోగుల ఆరోగ్య పథకం ఎక్కడా కూడా అమలవుతున్న దాఖలాలు లేవన్నారు బండి. హెల్త్ కార్డులతో ఏ కార్పొరేట్ హాస్పిటల్ కూడా వైద్యం చేయకపోవడంతో ఉద్యోగులు నానా యాతన పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించారు. ఇదేనా ఎంప్లాయిస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటే?. ఇకపై ఉద్యోగి పదవీ విరమణ చేసిన రోజే రావాల్సిన మానిటరీ బెనిఫిట్స్ అన్ని అందించి ఆనందంగా ఇంటికి పంపుతామని అసెంబ్లీ సాక్షిగా ఘనంగా ప్రకటించిన ముఖ్యమంత్రి మాటలు నీటి మీద రాతలేనా? విరమణ పొందిన తరువాత కూడా నెలల తరబడి బకాయిలు రాకపోవడం ఏంటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులన్నీ తక్షణమే మంజూరు చేయాలన్నారు బండి సంజయ్.