ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ రాసిన లేఖ ప్రజలను తప్పుదోవ పట్టించేలా అనేక అవాస్తవాలతో ఉందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. వడ్లను రాష్ట్ర ప్రభుత్వమే కొనాలని.. లేనిపక్షంలో కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కేసీఆర్ కు ఆయన బహిరంగ లేఖ రాశారు.
కేసీఆర్ వి అబద్ధాలేనని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఆధారాలతో సహా తేల్చారని తెలిపారు బండి. పంజాబ్ సహా అన్ని రాష్ట్రాల్లోనూ కేంద్రం బియ్యం సేకరిస్తుందే తప్ప ధాన్యం కాదన్నారు. యాసంగిలో కేంద్రం వరి ధాన్యం కొనబోమన్నది అబద్ధమని.. వానాకాలం మాదిరిగానే సేకరిస్తుందని స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ వైఖరి చూస్తుంటే ధాన్యం సేకరణలో పెద్ద కుంభకోణం దాగి ఉందని అనుమానం వ్యక్తం చేశారు. మిల్లర్లతో కుమ్మక్కై రేషన్ బియ్యం రీ సైక్లింగ్, లేని పంటను లెక్కల్లో చూపడం, పక్క రాష్ట్రాల్లోని బియ్యాన్ని తెచ్చి అమ్మినట్లు సమాచారముందన్నారు సంజయ్.
టీఆర్ఎస్ సర్కార్ కు చిత్తశుద్ధి ఉంటే రైతులు పండించిన ధాన్యాన్ని, ప్రతీ గింజను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల జీవితాలతో రాజకీయం చేస్తే బీజేపీ చూస్తూ ఉరుకోదన్న బండి.. వారికి అండగా ఉద్యమిస్తుందని స్పష్టం చేశారు.