కేసీఆర్ హఠావో..తెలంగాణ బచావో నినాదంతో ప్రజల్లోకి వెళుతున్నామన్న బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ కేసీఆర్ ప్రభుత్వం పై ఛార్జ్ షీట్ వేస్తామని చెప్పారు. ఈ సారి ఎన్నికల్లో 90 అసెంబ్లీ, 400 పార్లమెంట్ స్థానాలే లక్ష్యంగా బీజేపీ రూట్ మ్యాప్ సిద్ధమైందని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రజలకు ఉచిత వైద్యం, విద్య అందిస్తామని హామీ ఇచ్చారు.
ఏప్రిల్ నెలలో తెలంగాణలో భారీ బహిరంగ సభ జరుగుతుందని.. ఈ సభలోనే కేసీఆర్ ప్రభుత్వంపై ఛార్జ్ షీట్ ను విడుదల చేస్తామని లక్ష్మణ్ వెల్లడించారు. ఈ సభకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా లేక పోతే బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ముఖ్యఅతిథిగా వస్తారని చెప్పారు. ఇక ప్రతి నియోజక వర్గంలో బీజేపీ టికెట్ కోసం నలుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారని ఆయన అన్నారు. తెలంగాణలో అత్యధిక పార్లమెంట్ స్థానాలే లక్ష్యంగా బీజేపీ జాతీయ కార్యదర్శి బీఎల్ సంతోష్ ఆధ్వర్యంలో రూట్ మ్యాప్ రూపొందించామని చెప్పారు.
గతంలో గెలవని 160 పార్లమెంట్ స్థానాలపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టిందన్నారు. తెలంగాణలో అత్యధిక లోక్ సభ స్థానాల్లో గెలుపు కోసం నాలుగంచెల వ్యవస్థ ఏర్పాటు చేశామని లక్ష్మణ్ తెలిపారు. రానున్న నెల రోజుల్లో గ్రామ స్థాయిలో పది వేల స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు. మూడు నెలల కాలంలో వేల సంఖ్యలో మండల, జిల్లా స్థాయిలో మీటింగ్స్ ఉంటాయని,జనవరి నుంచి ప్రజా గోస..బీజేపీ భరోసా కార్యక్రమంతో ప్రజల్లోకి వెళతామని ఆయన చెప్పారు.
సీఎం కేసీఆర్ కుటుంబం తెలంగాణ సంపదను దోచుకుంటున్న విధానాన్ని ప్రజలకు వివరిస్తామని లక్ష్మణ్ అన్నారు. కేంద్రం పంచాయితీలకు ఇస్తోన్న నిధులను దోచుకుంటున్నారని బీఆర్ఎస్ సర్పంచ్ లే చెబుతున్నారని లక్ష్మణ్ చెప్పారు. హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని గెలవటమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని ఆయన స్పష్టం చేశారు.