ఉక్రెయిన్ లో ఉన్న 20వేలకు పైగా భారతీయుల ఇబ్బందులను కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లామన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ప్రధాని మోడీ వారిని కాపాడే చర్యలు తీసుకున్నారని చెప్పారు. ‘భారతీయులను క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా.. నా మాటగా చెప్పండి’ అని ప్రధాని స్పష్టంగా చెప్పారని తెలిపారు.
గురువారం రాత్రి 2 గంటల వరకు తాను కరీంనగర్ నుంచి ఉక్రెయిన్ వెళ్లిన పలు విద్యార్థుల కుటుంబాలను కలిసి, వారికి భరోసా కల్పించానన్నారు బండి. పలువురు విద్యార్థులతో నేరుగా వీడియో కాల్ లో మాట్లాడినట్లు చెప్పారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా అన్ని దేశాల విజ్ఞప్తి మేరకు సైనిక స్థావరాలు ఉన్న ప్రాంతాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని.. జనావాసాలు ఉన్న ప్రాంతాల్లో దాడులు చేయడం లేదని రష్యా హామీ ఇచ్చిందని తెలిపారు. కనుక ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
అక్కడ భయానక వాతావరణం ఉన్నట్టు సోషల్ మీడియాలో ఎవరూ దుష్ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేశారు సంజయ్. రాష్ట్ర పార్టీ తరఫున టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశామని.. తమకొచ్చిన నెంబర్లకు వీడియో కాల్ చేసి బాధితులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నట్లు వివరించారు.