రైతు రుణ మాఫీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఈ మేరకు సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. రెండో విడత పాదయాత్రలో అనేక మంది రైతులు తనను కలిసి అర్జీలు ఇచ్చారని తెలిపారు. గత ఏడు రోజులుగా ఏ గ్రామానికి వెళ్ళినా వందలాది మంది రుణమాఫీ జరగలేదని తమ గోడు వెళ్ళబోసుకున్నారని వివరించారు.
రైతు రుణమాఫీ జాప్యం.. రాష్ట్రంలో ఉన్న 14 లక్షల మంది కౌలు రైతులకు ఎటువంటి రక్షణ లేకపోవడంపై అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు బండి. ప్రభుత్వం నుండి రైతాంగం పొందే ఎటువంటి లబ్ది కూడా కౌలు రైతులకు అందకపోవడం విచారకరమని లేఖలో పేర్కొన్నారు. బాధ్యతగల ప్రతిపక్ష పార్టీగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను మీ దృష్టికి తీసుకొస్తున్నట్లు వివరించారు.
2018 ఎన్నికల సమయంలో లక్ష రూపాయల వరకు రైతుల బకాయిలను రద్దు చేస్తామని టీఆర్ఎస్ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు సంజయ్. ఈ నాలుగేండ్ల కాలంలో రూ.20,164.20 కోట్లు కేటాయించినట్లు గొప్పలు చెప్పినా అందులో ప్రభుత్వం విడుదల చేసింది కేవలం రూ.1,144.38 కోట్లు మాత్రమేనన్నారు. దీనివల్ల 5.66 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరగగా దాదాపు 31 లక్షల మంది ఎదురుచూస్తున్నారని తెలిపారు.
“25 వేల లోపు రుణమాఫీ కావాల్సిన రైతులు 2.96 లక్షలు ఉండగా వారికి కావాల్సింది రూ.408.30 కోట్లు. 25 వేల నుండి 50 వేల లోపు రుణమాఫీ కావాల్సిన రైతులు 5.72 లక్షలు ఉండగా వారికి కావాల్సింది రూ.1,790 కోట్లు, 50 వేల నుంచి 75 వేల లోపు రుణమాఫీ కావాల్సిన రైతులు 7 లక్షల మంది ఉండగా వారికి కావాల్సింది రూ.4 వేల కోట్లు, 75 వేల నుండి ఒక లక్ష వరకు రుణమాఫీ కావాల్సిన రైతులు 21 లక్షలమంది ఉండగా వారికి కావాల్సింది రూ.13 వేల కోట్లు. మొత్తంగా 36.68 లక్షలమంది రైతులకు 19,198.38 కోట్లు ప్రభుత్వం రుణమాఫీ చేయాల్సింది ఉంది. 50 వేల లోపు రుణమాఫీ కావాల్సిన రెండు లక్షలమంది రైతులకు సంబంధించిన రూ.857 కోట్ల బిల్లులు ప్రభుత్వానికి సమర్పించినా ఆర్థిక శాఖ పెండింలో పెట్టడం వల్ల రైతాంగం అనేక ఇబ్బందులు పడుతున్నారు. బిల్లులు అందింనంత వరకు ఆర్థిక శాఖ నిధులు విడుదల చేసేవిధంగా ప్రభుత్వం ఆదేశించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. మిగిలినవారికి వెంటనే రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం నుండి లబ్దిదారుల అకౌంట్లల్లో పడే సంక్షేమ పథకాల డబ్బును రుణమాఫీ బకాయిలకు బ్యాంకులు జమ చేసుకుంటున్నాయి. దీంతో చిన్న సన్నకారు రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం బ్యాంక్ ఉన్నతాధికారులతో మాట్లాడి సంక్షేమ పథకాల డబ్బును రుణమాఫీ బకాయిలకు జమ చేసుకోకుండా ఆదేశించాలని వారిని కోరాలి” అని అన్నారు బండి.
భూ యజమానుల హక్కులకు ఎటువంటి భంగం వాటిల్లకుండా రాష్ట్రాలు కౌలు చట్టాల్లో మార్పులు చేసుకోవాలని 11వ పంచవర్ష ప్రణాళిక పేర్కొందని వివరించారు. కౌలు చట్ట సవరణ అంటే భూ యజమానికి, కౌలుదారులకు భరోసా కల్పించేలా సవరణలు ఉండాలని ఆ నివేదికలో స్పష్టం చేశారని తెలిపారు. కానీ.. రాష్ట్ర ప్రభుత్వం కౌలుదారులకు ఎటువంటి హక్కులు కల్పించకపోగా వారిని కనీసం రైతులుగా గుర్తించడానికి కూడా నిరాకరించడం గర్హనీయంమని.. పావలా వడ్డీ రుణాలు కౌలుదారులకు ఇవ్వొచ్చని నాబార్డు సూచించిందన్నారు. కౌలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్న చిన్న సన్నకారు రైతులపై టీఆర్ఎస్ ప్రభుత్వం చూపుతున్న వివక్ష క్షమించరానిదన్న సంజయ్… అవసరమైతే కొత్త చట్టాలను తీసుకరావటం లేదా వున్న చట్టాలలో సవరణలు తెచ్చి వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు. పెండింలో వున్న రైతు రుణమాఫీ బకాయిలను వెంటనే చెల్లించటంతోపాటు కౌలు రైతుల సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై రైతు సంఘాలతో, అన్ని రాజకీయ పార్టీలతో వెంటనే ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ తరుఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు లేఖలో వివరించారు బండి సంజయ్.