తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరవెయ్యాలన్న లక్ష్యంతో, టిఆర్ఎస్ పార్టీపై సమర శంఖం పూరిస్తుంది బీజేపీ. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకొని, ప్రజల ఆదరణ పొందడానికి ప్రయత్నం చేస్తున్న బీజేపీ పాదయాత్ర పేరుతో ప్రజాక్షేత్రంలో కేసీఆర్ సర్కార్ తీరును ఎండగడుతోంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేరుగా రంగంలోకి దిగి పాదయాత్ర సాగిస్తున్నారు. తాజాగా మరోమారు ప్రజా సంగ్రామ యాత్ర మూడో విడతకు శ్రీకారం చుట్టారు.
యాదగిరి గుట్ట నుంచి మూడో విడత పాదయాత్ర ప్రారంభిస్తున్నట్లు బండి సంజయ్ అన్నారు. మొదటి విడత పాదయాత్రలో భాగ్యలక్ష్మి అమ్మవారు.. రెండో విడత పాదయాత్రలో జోగులాంబ అమ్మవారి శక్తి ఏంటో చూశారన్నారు. ప్రజలను ఇబ్బందులు పెట్టే వాళ్ళను యాదగిరి గుట్ట నర్సింహ స్వామి వారు ఎలా తెరమరుగు చేస్తారో అందరికి తెలుసని..అందుకే మూడో విడత పాదయాత్రను స్వామి వారి ఆశీస్సులతో మొదలు చేస్తున్నామన్నారు. యాదగిరి గుట్ట నుంచి వరంగల్ భద్రకాళి అమ్మవారు దేవాలయం వరకు మూడో విడత పాదయాత్ర ఉంటుందన్నారు.
రాష్ట్రంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల జరిగాయంటే పాద యాత్రే కారణమని బండి తెలిపారు. నిజాయితీ గల ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు.
తెలంగాణా ప్రజల్లో మార్పు వస్తుందని.. ప్రజలందరూ బీజేపీ వైపు చూస్తున్నారన్నారు. ఈ మార్పునకు ప్రజాసంగ్రామ యాత్రనే కారణమన్నారు. కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలు పాదయాత్రపై విమర్శలు చేశాయన్నారు. పాదయాత్ర ప్రజలకు ఒక భరోసా అని బండి సంజయ్ హామీ ఇచ్చారు.