తెలుగు ప్రజలకు భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. ఈ సందర్భంగా ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వంపై తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చి ఎనిమిదేళ్లు అయినా.. ప్రజల జీవితాల్లో మార్పు రాలేదన్నారు. ధనిక రాష్ట్రం అప్పుల తెలంగాణగా మార్చారని దుయ్యబట్టారు.
రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ 4వ స్థానంలో ఉందన్నారు. నీళ్లున్నా లేకున్నా, కరెంట్ వచ్చినా రాకున్నా, పంటకు ధర వచ్చినా రాకున్నా.. ఆరుగాలం కష్టపడి కలో, గంజో తాగి పంట పండించి దేశానికి అన్నం పెడుతున్న రైతన్నకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానన్నారు. దేశానికి అన్నం పెడుతున్న తెలంగాణ రైతులు నిండా కష్టాల్లో, నష్టాల్లో కూరుకుపోయారన్నారు.
పండుగ రోజు సైతం అబద్దాలు చెప్పకుండా ప్రజలకు వాస్తవాలు చెప్పేలా రాష్ట్ర పాలకులకు బుద్ధిని ప్రసాదించాలని భగవంతుడిని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.
వచ్చే ఏడాది తప్పకుండా తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పు వస్తుందని, రాష్ట్రానికి పట్టిన చీడ, పీడలు విరగడై సరికొత్త కాంతులతో రైతన్నలు సుఖసంతోషాల మధ్య సంక్రాంతి జరుపుకుంటారని ఆశిస్తున్నానని అన్నారు బండి సంజయ్.