బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సంచలన ప్రకటన చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వల్ల నష్టపోయిన 30 లక్షల మంది విద్యార్థులతో.. ‘నిరుద్యోగ మార్చ్’ నిర్వహిస్తామని ప్రకటించారు. బుధవారం హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం సమయంలో మిలియన్ మార్చ్ తరహాలోనే.. 30 లక్షల మంది విద్యార్థులతో నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తామని స్పష్టం చేశారు బండి సంజయ్.
పేపర్ లీక్ పై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నయీమ్ కేసు, మియాపూర్ భూకుంభకోణం, డ్రగ్స్ కేసులో సిట్ దర్యాప్తు ఏమైందని ప్రశ్నించారు బండి సంజయ్. తప్పు చేయనప్పుడు సిట్టింగ్ జడ్జితో ఎందుకు విచారణ చేయడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నిద్రావస్థలో ఉందని.. ముఖ్యమంత్రి కేసీఆర్ కు మూడిందని కీలక వ్యాఖ్యలు చేశారు.
పేపర్ లీకేజీ కేసులో ఇప్పటి వరకు సిట్ సాధించిందేమీ లేదని ఎద్దేవా చేశారు. సీఎం సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్ గా అన్న చందంగా సిట్ దర్యాప్తు ఉందని సెటైర్లు వేశారు బండి సంజయ్. నేను కానీ రేవంత్ రెడ్డి కానీ మాకు ప్రజల నుండి వచ్చిన సమాచారమే మాట్లాడతామని మాట్లాడటం చర్చకు దారితీసింది.
మాట్లడితే నోరు మూస్తం అని చెప్పేందుకే నోటీసులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిట్ నోటీసులివ్వాల్సింది తమకు కాదని.. సీఎం కేసీఆర్, కేటీఆర్ లకు అని పేర్కొన్నారు. 30 లక్షల నిరుద్యోగుల బతుకులు ఆగం చేయడం సర్వసాధారణమా.? అని ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ రాజీనామా చేసే వరకు పోరాటం ఆపబోమన్నారు.
అలాగే తీన్మార్ మల్లన్న ఇంటిపై దాడి ఘటనపై కూడా బండి సంజయ్ రియాక్ట్ అయ్యారు. తప్పు చేస్తే కేసులు పెట్టాలి కానీ.. ఇంటిపై దాడి చేయడమేంటని ప్రశ్నించారు. ప్రభుత్వ లోపాలను ప్రశ్నించే అన్ని మీడియా సంస్థల గొంతు నొక్కుతున్నారని విమర్శించారు. మీడియా కూడా ఏకం కావాల్సిన అవసరముందన్నారు. మళ్లీ ఎమర్జెన్సీ రోజులు స్టార్ట్ అయ్యాయని స్పష్టం చేశారు బండి సంజయ్.