ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి మించిన కుంభకోణం తెలంగాణలో జరిగిందని ఆరోపణలు చేశారు బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. త్వరలో ఆ కుంభకోణాన్ని ఆధారాలతో సహా బయటపెడతానని పేర్కొన్నారు. ఫారిన్ లిక్కర్ సేల్స్ ద్వారా తెలంగాణలో ఒక వ్యక్తికి వందల కోట్ల లబ్ది చేకూరుతోందని ఆరోపించారు.
ఫారిన్ లిక్కర్ పాలసీకి ఐదేళ్ళ కాలపరిమితి ఇవ్వటానికి కారణమేంటో తేలాలన్నారు. ఫారిన్ లిక్కర్ టెండర్ కు కేవలం 24 గంటల సమయమే ఎందుకు ఇచ్చారు?, టెండర్ లో కేవలం ఒక్క అప్లికేషన్ మాత్రమే ఎందుకొచ్చింది? అని ప్రశ్నించారు.
టెండర్ లో కేవలం ఒక్క అప్లికేషన్ మాత్రమే ఎందుకొచ్చిందని నిలదీశారు. హైదరాబాద్ లో ఒక వైన్స్ లో రోజుకు కోటి రూపాయల సేల్స్ ఉంటోందన్నారు బూర. ప్రభుత్వానికి రావాల్సిన డిస్కౌంట్ ఒక ప్రైవేట్ వ్యక్తికి వెళ్తోందని తెలిపారు. షాపు పేరు.. వ్యక్తి పేరు త్వరలో బయట పెడతామని వెల్లడించారు.
రాజకీయ పార్టీల్లో వ్యక్తుల మధ్య భేదాభ్రియాలు సహజమన్నారు. కాంగ్రెస్ కల్చర్ ను బీజేపీ దిగుమతి చేసుకుందనేది ప్రచారం మాత్రమే అని తేల్చేశారు. బండి సంజయ్ ఒక వ్యక్తి కాదు.. వ్యవస్థ అని.. వ్యక్తి కంటే వ్యవస్థలకే ప్రాధాన్యత ఉంటోందని పేర్కొన్నారు బూర నర్సయ్య గౌడ్.