తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. తాజాగా ఈ ఘటనపై బీజేపీ నేత ఈటల రాజేందర్ రియాక్ట్ అయ్యారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాలుగు పరీక్షల పేపర్స్ లీక్ అయ్యాయంటే బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరు ఏవిధంగా ఉందో అర్థమవుతోందని విమర్శించారు. ఇది కావాలని జరిగిందా? లేక యాదృచ్ఛికంగా జరిగిందా? అనే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
యువత తొందరపడి ఆత్మహత్యలకు పాల్పడొద్దని ఈటల సూచించారు. ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. బాధ్యులు ఎవరైనా కఠినంగా శిక్షించాలని కోరారు. రద్దైన పరీక్షలు వెంటనే నిర్వహించాలన్నారు. ఏళ్ల తరబడి నిరుద్యోగులు కష్టపడి అప్పులు చేసి చదువుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పెన్ డ్రైవ్ లో ఎక్కించేంత వరకూ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు? ఈటల రాజేందర్. మళ్లీ వారు చదువుకోవడానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసి, ఆదుకోవాలన్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్, కమిటీ సభ్యులు మూకుమ్మడిగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏవీఎన్ రెడ్డి ఎలా గెలిచారు అనే దాని మీద ఉన్న ఆసక్తి పేపర్ లీకేజీ రివ్యూ మీద లేదని ఎద్దేవా చేశారు. దీనికి సీఎం కేసీఆర్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని కోరారు. విద్యార్థుల్లో, నిరుద్యోగుల్లో ఆత్మవిశ్వాసం గవర్నర్ ని కోరినట్లు తెలిపారు ఈటల రాజేందర్.