తెలంగాణ మంత్రి కేటీఆర్ రాజకీయంలో ఓ బచ్చా.. అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు జితేందర్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ మోడీ చిటికెన వేలుకు కూడా పనికి రాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నీ వాక్ చాతుర్యం ఎవరి మీద ప్రయోగిస్తున్నారో తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తి పోతల పథకానికి ఓ సరైన డీపీఆర్ ఇచ్చారా? అని ప్రశ్నించారు. ఓ సారి జూరాల నుంచి.. మరోసారి నార్లపుర్ నుంచి ప్రాజెక్ట్ ను రూపొందించారు. అనవసరంగా ఎన్ జీటీ కోర్టులకు వెళ్లేలా మీ చర్యలు ఉన్నాయన్నారు.
మీ అహంకార వైఖరి వల్లే ఇంత జరిగిందన్నారు. కమిషన్ల కోసం రిజర్వాయిర్ లు కట్టారు. మేము ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇప్పిస్తామన్నారు. మేము ఓ పద్ధతి ప్రకారం ఈ ప్రాజెక్టును రూపొందించి.. జాతీయ హోదా సాధిస్తామన్నారు. నీటి వాటా కోసం అప్పట్లోనే సీఎం కేసీఆర్ 299 టీఎంసీలు చాలని ఉమా భారతి ముందు సంతకం చేశారు.
తెలంగాణకు అన్యాయం చేసిన వ్యక్తి సీఎం కేసీఆర్ అంటూ విమర్శించారు. ఇది కూడా మేము కృష్ణా నీటిలో 599 టీఎంసీల కోసం మా ప్రభుత్వము వచ్చాక సాధిస్తామన్నారు. ప్రధాని మోడీ అసమర్ధ ప్రధాని కాదు.. దేశంలోనే అందరికన్నా సోమరి సీఎం..కేసీఆర్ అని దుయ్యబట్టారు. నీవు కాదు ప్రధానికి సర్టిఫికేట్ ఇచ్చేది.. మొత్తం ప్రపంచం మోడీని ప్రశంసించిందన్నారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని మోడీ ఆపాడని గప్పాలు కొట్టారని అన్నవ్.. గప్పాలు కొట్టేది సీఎం కేసీఆర్ అంటూ విమర్శలు చేశారు. ఎక్కడ పోయినా గొప్పలు చెప్పుకునే స్థాయి సీఎం కేసీఆర్ ది.. ఎన్నికలపుడు ఎన్నో హామీలు ఇచ్చారు.. కానీ ఒక్కటీ అమలు కాలేదంటూ తీవ్రంగా మండిపడ్డారు జితేందర్ రెడ్డి.