బీసీలకు గత మూడున్నర సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో శ్వేత పత్రం విడుదల చేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి డిమాండ్ చేశారు. ప్రవాస భారతీయుడు గొలగాని రవికృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన వారధి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పురంధేశ్వరి పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మైనార్టీ మోర్చా ఏర్పాటు చేసిన రెండు రోజుల ప్రశిక్షణ కార్యక్రమాలను దగ్గుబాటి పురంధేశ్వరి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జాతీయ మైనార్టీ మోర్చా అధ్యక్షుడు జనాబ్ జమాల్ సిద్ధిఖీ జీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రశిక్షణకు మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. బీసీలకు గుర్తింపు తెచ్చి, వారిలో నాయకత్వ లక్షణాలు నేర్పింది ఎన్టీఆర్ అని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మూడు సంవత్సరాల్లో బీసీలకు చేసిందేమీ లేదన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ బీసీలను గుర్తిస్తుందన్నారు. వైసీపీ బీసీ కార్పొరేషన్ లను ప్రారంభించటమే కాదు.. నిధులు కేటాయించాలని ఆమె డిమాండ్ చేశారు. బీసీ కులాల మధ్య చిచ్చు పెట్టే రీతిలో బీసీ కార్పొరేషన్లు వున్నాయన్నారు. బీసీలకు ప్రభుత్వం ఏం చేసిందో శ్వేత పత్రం విడుదల చేయాలని పురంధేశ్వరి కోరారు. బీసీలను కులాల వారీగా విడదీసి కులా కుంపట్లు పెడుతోందని దుయ్యబట్టారు.
పారిశుధ్య కార్మికుల పిల్లలకు స్కాలర్ షిప్ ల పంపిణీ నిర్వహించారు. మైనార్టీల సంక్షేమానికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి నేటి వరకు మైనార్టీలను ఓటు బ్యాంకుగా చూస్తే .. బీజేపీ ప్రభుత్వం మాత్రమే మైనార్టీలకు న్యాయం చేసే దిశగా అడుగులు వేయడం జరిగిందన్నారు. త్రిబుల్ తలాఖ్ నుండి ముస్లిం మహిళలకు రక్షణ కల్పించింది కేవలం బీజేపీ మాత్రమే అన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలు ప్రతి ఇంటికి వెళ్లి కేంద్రం చేస్తున్న పథకాలను వివరించాలని కోరారు పురంధేశ్వరి.
అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు మాట్లాడుతూ.. మైనార్టీల్లో ఉన్న పేదరికాన్ని తొలగించి వ్యాపారస్తులుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. ప్రశిక్షణ కార్యక్రమంలో భారత రాజ్యాంగంపై రచించిన పుస్తకాన్ని దగ్గుబాటి పురంధేశ్వరి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ మోర్చా జాతీయ కార్యదర్శి లాయఖ్ అలీ, మైనార్టీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు షబనా, అనీఫ్ అలి, మైనార్టీ మోర్చా రాష్ట్ర ఇన్ ఛార్జ్ నాగోతు రమేష్ నాయుడు, ప్రకాష్ జైన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ బాషా తదితరులు పాల్గొన్నారు.