రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో గంజాయి దందా మూడు కిక్కులు, ఆరు దమ్ములు అన్న చందంగా మారిందని బీజేపీ నేత విజయశాంతి మండిపడ్డారు. ఒకప్పుడు పంజాబ్ రాష్ట్రంలో గంజాయి దందా ఎలా జరిగిందో… తెలంగాణలో ఇపుడు అదే జరుగుతుందని అయినా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.
సైదాబాద్లోని సింగరేణి కాలనీలో ఒక చిన్నారిపై హత్యాచారానికి పాల్పడ్డ రాజును పోలీసులు విచారించగా, అతనికి గంజాయి వ్యసనం ఉందని ఆ మత్తులోనే ఘాతుకానికి పాల్పడ్డారని విజయశాంతి అన్నారు. దీన్ని బట్టి ప్రభుత్వం ఎంత మత్తులో ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. గంజాయి కేవలం సింగరేణి కాలనీకే పరిమితమయ్యిందా?… అంటే నమ్మడం అసాధ్యం. పాఠశాలలకు వెళ్లాల్సిన చిన్న పిల్లల నుండి పెద్దవారు, బడాబాబులు సైతం గంజాయికి బానిసలయ్యి మహిళలపై అత్యాచారాలకు, హత్యలకు పాల్పడుతున్న ఉదంతాలే సర్కార్ మత్తుకు నిదర్శనమన్నారు.
బంజారాహిల్స్ ప్రాంతంలో సెలబ్రిటీలు, ఆకాశాన్ని తాకే బహుళ అంతస్తుల మధ్యలోని బస్తీల్లో గంజాయి దందా జోరుగా సాగుతున్నా… పోలీసులు పట్టించుకున్న దాఖలాలు లేవని విజయశాంతి మండిపడ్డారు. బస్తీల్లోకి వెళ్లేందుకు కూడా పోలీసులు సాహసం చేయడం లేదంటే… ఎంత నెట్వర్క్తో గంజాయి దందా నడుస్తోందో అర్థం చేసుకోవచ్చన్నారు. పార్కుల్లో యువత సిగరెట్లోని పొగాకు తీసి, గంజాయి కుక్కి సేవిస్తూ మత్తులో ఊగుతున్నారంటే… తెలంగాణ యువత ఎంతటి దౌర్బాగ్య స్థితికి దిగజారుతోందో అర్థం చేసుకోవచ్చని విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు. చీకటి ముసుగులో నగర గల్లీగల్లీలో యువత గంజాయికి ఎంతగా ప్రభావితులు అవుతున్నారో ఆ దేవుడికే తెలియాలి. యువత ఇంతలా చెడిపోతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్లు ఉండడం సిగ్గుచేటన్నారు.