బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు సర్వం సిద్ధం చేస్తున్నారు ఆపార్టీ నేతలు. ఈనెల 24 నుండి చేపట్టనున్న ఈ యాత్రకు ప్రజా సంగ్రామ పాదయాత్రగా నామకరణం చేశారు. ఎమ్మెల్యే రాజాసింగ్.. పార్టీ సీనియర్ నేతలతో కలిసి పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాజాసింగ్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వ అవినీతి, నియంతృత్వ, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా బండి సంజయ్ చేపట్టబోయే పాదయాత్రకు రాష్ట్రం నలుమూలల నుండి ప్రతీ ఒక్క కార్యకర్త హాజరయ్యేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నారని చెప్పారు.
పాతబస్తీని కేసీఆర్ ఎంఐఎం నేతలకు తాకట్టు పెట్టారని ఆరోపించారు రాజాసింగ్. అధికారం కోసం ఇతర పార్టీల ఎమ్మెల్యేలను సంతల్లో పశువుల్లా కొంటున్నారని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నా.. కేసీఆర్ మాత్రం అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కు దమ్ముంటే కేంద్రం ఇచ్చిన నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు రాజాసింగ్.
ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందేందుకే దళిత బంధు పేరిట హుజూరాబాద్ లో వందల కోట్ల రూపాయలు కేసీఆర్ ఖర్చు పెడుతున్నారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దళితులు, గిరిజనులు, పేదలు ఉన్నారని.. వారికోసం ఎందుకు నిధులు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. తన నియోజకవర్గ ప్రజలకు వందల కోట్ల రూపాయల దళిత బంధు నిధులు వస్తాయంటే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికల ప్రజాక్షేత్రంలో పోరాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు రాజాసింగ్.
ఇక ఈ కార్యక్రమంలో రాజాసింగ్ తోపాటు బీజేపీ ఉపాధ్యక్షుడు డాక్టర్ మనోహర్ రెడ్డి, మాజీమంత్రి చంద్రశేఖర్, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, మాజీ ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, బాబూమోహన్, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, కార్యదర్సులు ప్రకాశ్ రెడ్డి, జయశ్రీ, ఎస్పీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు బాషా, పాదయాత్ర కమిటీ సహా పలువురు నాయకులు పాల్గొన్నారు.