నిజమాబాద్ : ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రతీకార రాజకీయాలు నడుస్తున్నాయ్. ప్రజల సమస్యల కంటే పగలు తీర్చుకోవడమే ప్రభువుల లక్ష్యంగా అక్కడా ఇక్కడా కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరతకు, టీఆర్ఎస్ తరుఫున పోటీ చేసి ఓడిపోయిన నాయకురాలు కవితకు లింక్ పెడుతూ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్ర విమర్శలు చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నిజామాబాద్ లోక్సభ స్థానానికి పోటీ చేసిన కవితను రైతులు ఓడించారు. దాంతో కక్ష గట్టి కవిత ప్రభుత్వంలో తనకున్న పవర్ ఉఫయోగించి రైతులకు యూరియా అందకుండా చేస్తోందని, అందువల్లే ప్రభుత్వ యంత్రాంగం స్థానిక రైతుల్ని నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. యూరియాను నిల్వ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో చెబుతున్నాతెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. యూరియా నిల్వ చేసుకునేందుకు గోడౌన్స్ లేవని చెప్పి తెప్పించుకోలేదని అరవింద్ రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
నిజామాబాద్ జిల్లాకు వచ్చిన యూరియాను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తరలించుకుపోయారని ఆయన ఆరోపించారు. దాదాపు 20 టన్నుల యూరియాను ఇతర జిల్లాలకు తరలించారని చెప్పారు. దీనికి జిల్లా మంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమాధానం చెప్పాలని అన్నారు. రైతులు నిరసన వ్యక్తం చేయకుండా ఉండాలంటే యూరియా సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి ఎంత యూరియా కావాలంటే అంత యూరియా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.