రాష్ట్ర బీజేపీలో లుకలుకలపై ఆ పార్టీ నిజామాబాద్ ఎంపీ అరవింద్ స్పందించారు. గురువారం ఆయన నవీపేటలో ఏర్పాటు చేసిన బీజేపీ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరవింద్ మాట్లాడుతూ.. పార్టీలో ఎలాంటి లుకలుకలు లేవని క్లారిటీ ఇచ్చారు. ఇదంతా కేవలం మీడియా సృష్టేనని కొట్టిపారేశారు.
కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని తేల్చిచెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు డిపాజిట్లు కూడా దక్కవని విమర్శించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా గెలుపే లక్ష్యంగా పని చేయాలని కార్యకర్తలకు సూచించారు. బీఆర్ఎస్ తో యుద్ధానికి కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
వచ్చే ఎన్నికల్లో యుద్ధ వాతావరణం ఉంటుందని చెప్పుకొచ్చారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ స్థానాలు బీజేపీ గెలిచే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. బోధన ఎమ్మెల్యేగా షకీల్ ఉండటం వల్ల అసాంఘిక శక్తులకు అడ్డగా మారిందని ధ్వజమెత్తారు.
ఇందూర్.. దేశ ద్రోహులకు అడ్డాగా మారిందని విమర్శించారు. సీఎం కేసీఆర్, జిల్లా మంత్రి, ఎమ్మెల్సీ కవిత, బోధన ఎమ్మెల్యే షకీల్ దేశ ద్రోహులకు వత్తాసు పలుకుతున్నారని వ్యాఖ్యానించారు. జిల్లాను దేశ ద్రోహులకు అడ్డాగా మార్చడం దురదృష్టకరమని ధ్వజమెత్తారు ఎంపీ అరవింద్.