– కోయిల్ సాగర్ ను చూస్తే బాధేస్తోంది
– కాలువ తవ్వి పనులు చేయడం లేదు
– ఇదంతా అహనా పెళ్లంట కోడి సీన్ ను తలపిస్తోంది
– సొంత ప్రయోజనాలే తప్ప జనం బాధలు పట్టవా?
– 19వ రోజు పాదయాత్రలో బండి
కోయిల్ సాగర్ కెనాల్ ను చూస్తే అహనా పెళ్లంట సినిమాలో కోడి సీన్ గుర్తుకొస్తోందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 19వ రోజు నారాయణపేట నియోజకవర్గంలోని మణిపూర్ తండా మీదుగా రామకిష్టయ్య పల్లెదాకా పాదయాత్ర చేశారు. రామకిష్టయ్యపల్లెలో పార్టీ నేతలతో కలిసి బీజేపీ జెండాను ఆవిష్కరించారు. తర్వాత అక్కడి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కేసీఆర్ సొంత ప్రయోజనాలుంటే తప్ప ఏ పని చేయ అవినీతి పరుడని విమర్శించారు.
కోయిల్ సాగర్ కాలువకు నీళ్లు పారితే రామకిష్టయ్యపల్లె సహా చుట్టుపక్కల ప్రాంతానికి రెండు పంటలొస్తాయన్నారు సంజయ్. గత ఎన్నికల్లో పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన సీఎం మాట తప్పారని మండిపడ్డారు. రైతుల ప్రయోజనాలు కేసీఆర్ కు పట్టవని… ఆయనకు లాభం జరుగుతుందంటే తప్ప ఏ పనీ చేయరని విమర్శించారు. ఈ ప్రాంతంలో కేసీఆర్ 300 ఎకరాల భూమిస్తే తప్ప ఇక్కడి పనులు చేపట్టే అవకాశం లేదన్న బండి… వేల కోట్ల రూపాయల కమీషన్లు వస్తాయంటేనే సీఎం పనులు చేస్తారని ఎద్దేవ చేశారు.
“ఉపాధి కూలీల సొమ్మును 3 నెలలుగా ఇవ్వడం లేదు. ప్రతి ఉపాధి కూలీకి రూ.270లను కేంద్రం చెల్లిస్తోంది. ఆ సొమ్మును కూలీల ఖాతాల్లో వేయకుండా కేసీఆర్ జాప్యం చేస్తూ వారి పొట్ట గొడుతున్నారు. సాగు, తాగు నీళ్లు లేక ఈ ప్రాంత ప్రజలు అల్లాడుతుంటే… మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ శుద్ధ నీరిస్తున్నామని కేసీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారు. ఈసారి టీఆర్ఎస్ నేతలు వస్తే నీళ్లేవని లదీయండి” అని ప్రజలకు పిలుపునిచ్చారు.
పేదోళ్లకు మరో 5 నెలలపాటు రేషన్ బియ్యాన్ని ఉచితంగా సరఫరా చేసేందుకు సిద్ధమైతే.. ఆ బియ్యాన్ని ఆపి కేసీఆర్ పేదల పొట్టకొడుతున్నారని మండిపడ్డారు బండి సంజయ్. పేదోళ్లంతా ఏకమై కేసీఆర్ పాలనకు చరమ గీతం పాడాలని.. బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని కోరారు.