తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కమలనాథులు దూకుడు పెంచారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం దృష్టి కేంద్రీకరించింది. ఈ క్రమంలో ఇక నుంచి నిత్యం ప్రజల్లో ఉండాలని ఆ పార్టీ నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రజా గోస- బీజేపీ భరోసా పేరుతో ఇవాళ్టి నుంచి బైక్ ర్యాలీ యాత్రలు నిర్వహించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో ప్రతీనెల 20 రోజులు ప్రజాసంగ్రామయాత్ర, పదిరోజులపాటు ప్రజా గోస – బీజేపీ భరోసా పేరిట బైక్ర్యాలీలు చేపట్టనున్నారు. ఈ విధంగా పాదయాత్ర, బైక్ ర్యాలీలను ఒకదాని తర్వాత మరొకటి సమాంతరంగా ఒక క్రమపద్ధతిలో కొనసాగించనున్నారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు రాష్ట్ర పార్టీ నాయకత్వంతో పాటు కేంద్ర నాయకత్వం ప్రత్యేక దృష్టిసారించింది. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో తెలంగాణ గడ్డపై కాషాయం జెండాను ఎగురవేయడమే లక్ష్యంగా పార్టీ నేతలు పకడ్బందీగా ముందుకెళ్తున్నారు.
ఇప్పటికే టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా రాష్ట్రంలో మాటల యద్ధం సాగుతోంది. ప్రస్తుతం బీజేపీ చేపట్టబోయే బైక్ ర్యాలీ యాత్రల ద్వారా రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక పాలన సాగిస్తుందని ప్రజలకు బలంగా వినిపించనున్నారు. బీజేపీతోనే తెలంగాణ అన్నిరంగాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రజలకు వివరించనున్నారు. మరోవైపు రాష్ట్రస్థాయి మొదలుకుని జిల్లా, నియోజకవర్గస్థాయి వరకు అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్, ఇతర పార్టీల నాయకులను చేర్చుకునే విషయంలో పకడ్బందీగా ఆపరేషన్ ఆకర్ష్ నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది.
పార్టీపరంగా ఏయే నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు కావాలో ప్రధానంగా ఆచోట్ల ఇతర పార్టీల్లోని బలమైన నేతలను చేర్చుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించారు. ఆయా పార్టీల నేతలు బీజేపీలో చేరేదాకా పూర్తిగా సీక్రెట్ ఎజెండా పాటిస్తూ, వారి పేర్లు ముందుగానే బయటపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జాతీయ నాయకత్వం ఆదేశించింది. టీఆర్ఎస్ నుంచి ముఖ్యమైన నాయకులను చేర్చుకునే విషయంలో ఇప్పటికే రహస్య కార్యాచరణ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది.