తెలంగాణ వ్యాప్తంగా టీఎస్పీఎస్సీ ప్రశ్నా పత్రాల లీకేజి వ్యవహారం దుమారం రేపుతోంది. ఈ పరిణామాన్ని రాజకీయం చేసేందుకు బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. తాజాగా ఈ లీకేజీ వ్యవహారానికి సంబంధించి బీజేపీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నిర్ణయించింది. లీకేజీ అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ చేయడం, యూనివర్సిటీలను సందర్శించడం, పరీక్షలు రాసిన అభ్యర్థుల దగ్గరికెళ్లడం వంటివి చేపట్టేలా కార్యాచరణను రూపొందిస్తోంది.
ఇందులో భాగంగా విద్యార్థులు, నిరుద్యోగ యువతను, వారి తల్లితండ్రుల దృష్టిని ఆకర్షించేలా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని బీజేపీ భావిస్తోంది. ఇప్పటికే ఈ లీకేజీ వ్యవహారంపై రాష్ట్ర పార్టీ, బీజేవైఎం, ఇతర విభాగాలు చేపట్టిన కార్యక్రమాలతో వివిధ వర్గాల ప్రజల్లో మంచి మైలేజీ వచ్చిందని పార్టీ నాయకత్వం భావిస్తోంది.
అంతేకాకుండా లీకేజీ విషయంతో పాటు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత విచారణ, బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను, మంత్రులు, అధికారపార్టీ నేతల తీరును ఎండగట్టేలా ఆందోళన కార్యక్రమాలను మరింతగా చేపట్టాలని వ్యూహ రచన చేస్తోంది భారతీయ జనతా పార్టీ.
కాంగ్రెస్ తో సహా ఇతర రాజకీయ పార్టీల కంటే ముందుగా ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి చర్చనీయాంశం చేయడంలో విజయం సాధించామని బీజేపీ ముఖ్య నేత పేర్కొన్నారు. టీఎస్పీఎస్సీ పరీక్షల నిర్వహణ తీరు, లోటుపాట్లను ఎత్తి చూపి, తమ పార్టీకి అనుకూలంగా ప్రజల మద్దతును రాబట్టుకోగలిగామని ఆయన అభిప్రాయపడ్డారు. ఏదిఏమైనా ఈ విషయాన్ని తమకు ప్లస్ చేసుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తోంది బీజేపీ. మరి ఈ విషయం భారతీయ జనతా పార్టీకి ఎంతవరకూ ఉపయోగపడుతుందో చూడాలి.