విజయశాంతి, బీజేపీ సీనియర్ నేత
మహిళల్ని అవమానించి పైశాచిక ఆనందం పొందుతున్న కేసీఆర్.. ఈసారి తన శాడిస్ట్ మనస్తత్వానికి ఏకంగా తెలంగాణ గవర్నర్ తమిళిసైని లక్ష్యంగా చేసుకున్నారు. ఇది తీవ్ర అభ్యంతరకరం. ఇది ఇప్పటి బడ్జెట్ సమావేశాల అంశం మాత్రమే కాదు. గత నెలలో జరిగిన రిపబ్లిక్ దినోత్సవం రోజున కూడా కేసీఆర్, రాష్ట్ర మంత్రులు రాజ్ భవన్ కార్యక్రమానికి హాజరు కాకుండా గవర్నర్ ని అవమానించారు. మేడారంలో సమ్మక్క, సారలమ్మ ఆడబిడ్డ దేవతల జాతరలో కూడా మహిళా గవర్నర్ ని ప్రోటోకాల్ ఉల్లంఘనతో అవమానించారు. స్వాగతం పలికేందుకు… వీడ్కోలు చెప్పేందుకు ములుగు జిల్లా కలెక్టర్, ఎస్పీ రాలేదు. మేడారంలో గవర్నర్ ఉన్నంత సేపు మంత్రులు, అధికారులు కనిపించలేదు. ముఖ్యంగా గిరిజన ప్రాంత అభివృద్దిపై గవర్నర్ కు ప్రత్యేక అధికారాలు ఉంటాయి. అయినా కలెక్టర్ గానీ, ఎస్పీ గానీ పట్టించుకోలేదు.
గవర్నర్ పర్యటన రోజున.. ఆ ఉదయం వరకూ మంత్రులు అక్కడే ఉన్నరు. కానీ, తమిళిసై వచ్చే సమయానికే ఎలా మాయమయ్యారు? వీరంతా గవర్నర్ పట్ల ఇలా ప్రవర్తించేలా ఎవరు పురిగొల్పారో అందరికీ తెలుసు. ఈ చర్యలన్నీ యావత్ మహిళా లోకాన్ని అవమానించడం తప్ప మరొకటి కాదు. తమిళ ఆడపడుచు అయిన గవర్నర్ ని ఘోరంగా అవమానిస్తున్న కేసీఆర్… ఏ ముఖంతో తమిళనాడు సీఎంతో ఫ్రంట్ పేరు చెప్పి మీటింగులు చేస్తున్నారు? తమిళ ప్రజలేమీ అమాయకులు కారు.
మహిళల పట్ల తొలి నుంచీ కేసీఆర్ వివక్షతోనే వ్యవహరిస్తూ వస్తున్నారు. టీఆర్ఎస్ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన కేబినెట్ లో ఒక్క మహిళకు కూడా చోటు దక్కలేదు. రెండోసారి అధికారంలోకి వచ్చిన 6 నెలల వరకు కేబినెట్ ను విస్తరించలేదు. పలు విమర్శల నేపథ్యంలో మాత్రమే ఆ విస్తరణలో పేరుకు ఇద్దరు మహిళలకి మంత్రి పదవులిచ్చారు. గతేడాది ఫిబ్రవరి నెలలో జరిగిన నాగార్జునసాగర్ ఉపఎన్నిక సందర్భంగా సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన మహిళలను కుక్కలు అని దూషించిన కేసీఆర్ వ్యాఖ్యలను మహిళాలోకం మర్చిపోలేదు. మహిళలపై ఇలా వ్యవహరించే కేసీఆర్… చట్ట సభల నిర్వహణలో రూల్స్ పాటిస్తారనుకోవడం పొరపాటే.
గవర్నర్ నోటిఫికేషన్ ఇవ్వకుండానే అసెంబ్లీ సెషన్ ప్రారంభిస్తున్నారు. పైగా అసెంబ్లీ ప్రొరోగ్ కానందున ఈ సెషన్ ను ఇంతకుముందు జరిగిన దానికి కొనసాగింపుగానే పరిగణిస్తామనడం మూర్ఖత్వం కాదా? ఆర్టికల్ 176 ప్రకారం గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన తర్వాతే బడ్జెట్ సెషన్ ప్రారంభం కావాలి. కానీ.. రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగం అమలవుతోంది. కేసీఆర్ రూల్స్ ఏవీ పాటించడం లేదు. నేనే ఒక రాజు, తెలంగాణ ఒక రాజ్యం అన్నట్లుగా ఫీల్ అవుతున్నారు. రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న గవర్నర్ నే గుర్తించనని కేసీఆర్ కు సీఎం సీటులో ఒక్క నిమిషం కూడా కూర్చునే అర్హత లేదు. ప్రజలు ఆయన చేష్టలన్నీ గమనిస్తూనే ఉన్నారు. తగిన సమయంలో కచ్చితంగా బుద్ధి చెప్తారు.