స్వరాష్ట్రం ఏర్పడితే తమ జీవితాలు మారతాయని ఆశపడ్డ గ్రామ పంచాయితీ కార్మికులకు కేసీఆర్ ప్రభుత్వం పాలనలో నిరాశే మిగిలిందని విమర్శించారు బీజేపీ నేత విజయశాంతి. పల్లె ప్రగతిలో ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎం ఎన్నోసార్లు కార్మికులు అద్భుతంగా పనిచేశారని పొగిడారు తప్ప… జీతాలు మాత్రం ఇప్పటివరకు పెంచలేదని గుర్తు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12,761 గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికుల్లో 90 శాతం మంది బీసీ, ఎస్సీ వర్గాల నుంచే అత్యధికంగా ఉన్నారని చెప్పారు విజయశాంతి. వారు ఎన్నో ఏళ్ల నుంచి గ్రామాల్లో నీటి సరఫరా, డ్రైనేజీల క్లీనింగ్ తో పాటు అన్ని పనులు చేస్తున్నారని వివరించారు. దీనికితోడు గతేడాది నుంచి స్కూళ్ల క్లీనింగ్ బాధ్యతను కూడా అప్పగించి.. అదనపు భారాన్ని పెంచిన సర్కార్ జీతం ఒక్క రూపాయి కూడా పెంచకపోవడం సిగ్గుచేటన్నారు.
గ్రామాల్లోని జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ లతో పాటు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు… మున్సిపాలిటీ, కార్పొరేషన్ల కార్మికుల జీతాలను 2014 నుంచి ఇప్పటివరకు మూడుసార్లు పెంచారని గుర్తు చేశారు విజయశాంతి. కానీ.. గ్రామాల శుభ్రతకు పాటుపడుతున్న సుమారు 36,500 మంది కార్మికులను మాత్రం రూ.8 వేల జీతానికే పరిమితం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ జీతాలు పెంచాలని కార్మికులు ఎన్నోసార్లు ప్రభుత్వాన్ని కోరినా కేసీఆర్ పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.
కొత్త గ్రామపంచాయతీలలో ఎన్నో ఖాళీలు ఉన్నా భర్తీ చేయడం లేదన్నారు విజయశాంతి. ఫలితంగా ఉన్నవాళ్లకు పనిభారం పెరుగుతోందని తెలిపారు. సర్కార్ కు పనిభారం పెంచడమే తప్ప.. జీతాలు పెంచాలనే సోయి లేకుండా పోయిందని మండిపడ్డారు. గ్రామాల పారిశుద్ధ్యానికి పాటు పడుతున్న కార్మికులను ఇప్పటికైనా గుర్తించి పీఆర్సీ కమిషన్ సిఫార్సు చేసిన కనీస వేతనం అందిస్తే మంచిదని సూచించారు.