బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు పోటాపోటీ దీక్షలకు సిద్ధమయ్యాయి. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఢిల్లీలో ఎమ్మెల్సీ కవిత శుక్రవారం నిరసన దీక్ష తలపెట్టింది. ఎమ్మెల్సీ కవిత దీక్షకు కౌంటర్ గా బీజేపీ మరో దీక్ష చేపట్టబోతుంది. శుక్రవారం హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంతో పాటు ఢిల్లీలో బీజేపీ నేతలు నిరసన దీక్షకు సన్నద్ధం అవుతున్నారు.
నాంపల్లి కార్యాలయంలో జరగబోయే దీక్షలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, డీకే అరుణతో పాటు పార్టీ ముఖ్య నతేలు పాల్గొనబోతున్నారు. రాష్ట్రంలో పెరిగిన బెల్ట్ షాపులకు నిరసనగా ‘మహిళ గోస-బీజేపీ భరోసా’ పేరుతో ఈ కార్యక్రమం చేపట్టబోతున్నారు. మరోవైపు ఢిల్లీ బీజేపీ యూనిట్ సైతం శుక్రవారం దీక్ష చేపట్టబోతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు వ్యతిరేకంగా బీజేపీ నేతలు జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపట్టాలని మొదట భావించారు.
అయితే ఒకే రోజు ఇటు కవిత.. అటు బీజేపీ నేతలు నిరసన కార్యక్రమాల కోసం దరఖాస్తులు రాగా స్థలం విషయంలో తర్జన భర్జన కొనసాగింది. దీక్ష స్థలాన్ని చెరి కొంత భాగం పంచుకోవాలని ప్రతిపాదనన తీసుకురాగా.. బీజేపీ నేతలు అందుకు అంగీకరించి జంతర్ మంతర్ నుంచి ధర్నా వేదికను దీన్ దయాల్ మార్గ్ కు మార్చుకున్నారు.
దీంతో కవిత చేపట్టబోయే దీక్షకు లైన్ క్లియర్ అయింది. జంతర్ మంతర్ లోనే యథావిధిగా కవిత నిరాహార దీక్ష కొనసాగనుంది. జంతర్ మంతర్ వద్ద దీక్ష కోసం జాగృతి నేతలతో పాటు ఢిల్లీ బీజేపీ నేతలు అప్లై చేసుకోవడంతో.. స్థలం విషయంలో ఇరు వర్గాలు రాజీ కుదుర్చుకోవాలని పోలీసులు సమాచారం ఇచ్చారు. అయితే తమకు పెద్ద సంఖ్యలో జనం వస్తారని అందువల్ల తమకే కేటాయించాలని భారత్ జాగృతి నేతలు చెప్పడంతో బీజేపీ నేతలు తమ దీక్ష వేదికను మార్చుకున్నారు.