పోలీస్ కానిస్టేబుల్ నియామాకాల విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ బీజేవైఎం నేతలు గురువారంనాడు ప్రగతి భవన్ ను ముట్టడించేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది.ప్రగతి భవన్ ముట్టడించేందుకు వచ్చిన బీజేవైఎం శ్రేణులను పోలీసులు అడ్డుకున్నాయి. పోలీసులకు బీజేవైఎం శ్రేణుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ప్రగతి భవన్ వైపునకు వెళ్లే ప్రయత్నం చేశారు. బీజేవైఎం శ్రేణులను అరెస్ట్ చేసి పోలీసులు సమీపంలోని పోలీస్ స్టేషన్ కు తరలించారు. కానిస్టేబుల్ నియామకాల విషయంలో గతంలో ఉన్న నియమాలనే కొనసాగించాలని బీజేవైఎం నేతలు డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుళ్లు, ఎస్ఐ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టింది. పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. సివిల్ పోలీస్ కానిస్టేబుల్ విభాగంలో 15,664, ఎక్సైజ్ విభాగంలో 614, రవాణా శాఖలో 63 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షలకు సంబంధించి కటాఫ్ మార్కులను రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. ఎస్సీ, ఎస్టీలకు 40 మార్కులు , బీసీలకు 50గా నిర్ణయించారు. ఓసీలకు 60 మార్కులను కటాఫ్ గా నిర్ణయించారు.
కానిస్టేబుల్ పరీక్షల్లో కొన్ని ప్రశ్నలు తప్పులుగా ఉన్నాయని కానిస్టేబుల్ అభ్యర్ధులు గతంలో ఆందోళన నిర్వహించారు. మరో వైపు గత ఏడాది డిసెంబర్ చివరి నుండి ఈ నెల మొదటి వారం వరకు కానిస్టేబుల్ , ఎస్ఐ ఉద్యోగాల కోసం అభ్యర్ధులకు ఫిజికల్ ఫిట్ నెస్ టెస్టులు నిర్వహించారు. అయితే ఫిజికల్ ఫిట్ నెస్ టెస్టులకు సంబంధించి లాంగ్ జంప్ వంటి పరీక్షలకు 3.8 మీటర్ల నుండి 4 మీటర్లకు పెంచారని కానిస్టేబుల్ అబ్యర్ధులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఉన్నట్టుగానే ఫిజికల్ ఫిట్ నెస్ పరీక్షలను నిర్వహించాలని బీజేవైఎం నేతలు డిమాండ్ చేశారు.ఇదే రకమైన డిమాండ్ తో కాంగ్రెస్ నేతలు కూడా ఆందోలన నిర్వహించారు. కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ప్రయత్నించిన అభ్యర్ధులకు న్యాయం చేయాలని కోరారు.
కార్యకర్తల అరెస్ట్ను ఖండించిన బండి!!
బీజేవైఎం కార్యకర్తలు, పోలీసు పరీక్ష అభ్యర్థుల అరెస్టును ఖండిస్తున్నానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. అరెస్టు చేసిన యువ మోర్చా కార్యకర్తలు, పోలీసు పరీక్షా అభ్యర్థులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోలీసు రిక్రూర్మెంట్ పరీక్షల్లో ఉన్న అసంబద్ధ నిబంధనలు మార్చాలని మొరపెట్టుకున్నా వినకుండా ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పరీక్షా నిబంధనను మార్చాలని తానే స్వయంగా సీఎం గారికి లేఖ రాసినా స్పందించలేదని విమర్శించారు. సీఎంను కలవడానికి వెళితే బీజేవైఎం, పోలీస్ పరీక్ష అభ్యర్థులపై పోలీసులు విచక్షణా రహితంగా ప్రవర్తించారని ఆరోపించారు. 2 లక్షల మంది పోలీస్ అభ్యర్థుల విన్నపాన్ని వినే సమయం సీఎంకు లేదా అని బండి సంజయ్ ప్రశ్నించారు. వీళ్ళ బాధలు వినలేనంత తీరిక లేకుండా సీఎం ఏం ఘనకార్యం చేస్తున్నారని విమర్శించారు. బీజేవైఎం కార్యకర్తల పట్ల విచక్షణా రహితంగా వ్యవహరించిన పోలీసులపై చర్య తీసుకోవాలన్న బండి సంజయ్.. వెంటనే పోలీసు పరీక్షల్లోని నిబంధనలను సవరించి అన్యాయానికి గురైన అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు.
పరీక్ష రాసిన వేలమంది రోడ్డు మీదకు రావలసిన పరిస్థితి ఎందుకొచ్చిందో సీఎం అర్థం చేసుకోవాలన్నారు. ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి పోలీసు రిక్రూట్మెంట్ పరీక్షలో జరిగిన నిబంధనలను సవరించాలని డిమాండ్ చేశారు.