ఏపీలో కల్తీ మద్యం విక్రయాల వల్ల వైసీపీ నేతలు వందల కోట్ల రూపాయలను కొల్లగొట్టారని టీడీపీ సీనియర్ నేత బోండా ఉమ ఆరోపించారు. రాష్ట్రంలో పెద్దిరెడ్డి పెద్దారెడ్డిగా మారి.. అరాచకాలు, అవినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. జే గ్యాంగులో పెద్దిరెడ్డి ప్రధాన భాగస్వామిగా కొనసాగుతున్నారని ఆరోపించారు. జగన్ లావాదేవీలన్నింటినీ దగ్గరుండి చూస్తారని విమర్శలు చేశారు.
చిన్నచిన్న డిస్టిలరీను తరిమివేసి.. వాటిని లీజుకు తీసుకుని జే బ్రాండ్ మద్యం తయారు చేస్తున్నారని ఆరోపించారు. కల్తీ మద్యంతో సుమారు 350 కోట్ల రూపాయలను సంపాదించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా మంత్రి పెద్దిరెడ్డి అక్రమార్జన అక్షరాలా రూ. 6889 కోట్లు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శివశక్తి డెయిరీ ద్వారా పాడి రైతుల పొట్ట కొట్టి రూ.700 కోట్లు దోచారన్న ఘనుడు పెద్దిరెడ్డి అని విమర్శించారు.
పల్ప్ కంపెనీ ద్వారా మామిడి రైతుల నుంచి రూ. 190 కోట్లు దోపిడీ చేశారని ద్వజమెత్తారు. మద్యం, మైనింగ్, ఇసుక మాఫియాగా ఏర్పడి భారీ దొపిడీకి తెర లేపారని బోండా ఉమ ఆరోపించారు. వేల ఎకరాలను భూమాఫియా ద్వారా చేజిక్కించుకుని.. రూ. 2 వేల కోట్లకు పైగా అక్రమార్జన చేసిన ఘనత పెద్దిరెడ్డిదే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా పుష్ప సినిమా స్టైల్లో ఎర్రచందనం చెట్లను నరికించి.. కేవలం వాటి ద్వారానే రూ. 1800 కోట్లు వెనకేశారని బోండా ఉమ అన్నారు.
ఇదంతా సీఎం జగన్ వ్యూహమేనేని విరుచుకుపడ్డారు. జగన్ ప్రభుత్వంపై సీబీఐ విచారణ చేస్తే రాజీనామాలు చేసిన మంత్రులంతా జైలుకెళ్లడం ఖాయమన్నారు. మామూలు దొంగలను కేబినెట్ నుంచి తప్పించి.. గజ దొంగలను సీఎం జగన్ తన కేబినెట్ లోకి తీసుకుంటారనే అనుమానం ఉందన్నారు. ఈ స్థాయిలో దొపిడీ చేసిన పెద్దిరెఢ్డిని కేబినెట్ లో కొనసాగిస్తారా..? లేక తప్పిస్తారా అనేది చూడాలని ఆసక్తిగా ఉందన్నారు బోండా ఉమా.