సీఎం కేసీఆర్పై మాజీ ఎంపీ, బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ ఫైర్ అయ్యారు. రాష్ట్రప్రజలకు ఇచ్చిన హామీలను కప్పి పుచ్చుకునేందుకే కేసీఆర్ బీఆర్ఎస్ ను స్థాపించారని ఆయన అన్నారు. ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్బావ సభలో ముఖ్యమంత్రి ఇచ్చిన స్పీచ్లో పస లేదన్నారు.
ఈ తొమ్మిదేండ్లలో రాష్ట్రానికి చేసిన అభివృద్ధి ఏంటని ఆయన ప్రశ్నించారు. కమ్యూనిస్టు పార్టీలు స్వలాభం కోసమే బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నాయన్నారు. నాలుగు ఆస్పత్రులు ఏర్పాటు చేయాలని కోరితే తనను పార్టీ నుంచి వెళ్లగొట్టారని ఆయన ఆరోపించారు.
కానీ ఇప్పుడు ఎన్నికల కోసమే రూ.200 కోట్ల నిధులతో ‘కంటి వెలుగు’కార్యక్రమాన్ని పెట్టారని ఆయన మండిపడ్డారు. కంటి వెలుగు కేంద్రంలో ఒక్క కంటి డాక్టర్ కూడా లేరని ఆయన పేర్కొన్నారు. సరోజిని దేవి కంటి ఆస్పత్రిలో యేటా 9 వేల ఆపరేషన్లు చేస్తున్నారని తెలిపారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధానంగా కంటి ఆస్పత్రి చేయాలని ఆయన కోరారు. ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు ‘ప్రగతి నివేదన యాత్ర’ చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
ఇబ్రహీంపట్నంలో ప్రజల ఆవేదన, నివేదికను త్వరలోనే ప్రజల ముందుకు తీసుకొస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో దళితులపై సీఎం కేసీఆర్ వివక్షత చూపుతున్నారని ఆయన ఆరోపించారు. ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఎస్సీకి రిజర్వ్ అయిందన్నారు. అందుకే ఆ పదవి ఇవ్వడం ఇష్టం లేకే మూడేండ్లుగా కాలయాపన చేశారని ఆరోపించారు.