నాగ్ పూర్ వేదికగా జరిగిన బోర్డర్ గావాస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో టీమిండియా ఘన విజయాన్ని సాధించింది. భారత్ స్పిన్నర్ల ధాటికి ఆసీస్ బ్యాట్స్ మెన్ పెవిలియన్ బాట పట్టారు. దీంతో రెండో ఇన్సింగ్స్ లో 91 పరుగులకే ఆసీస్ ఆలౌట్ కావడంతో.. 132 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. కేవలం మూడు రోజుల్లోనే మ్యాచ్ ను ముగించి సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.
మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్లో కేవలం 177 పరుగులకే ఆలౌట్ అయ్యింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆడిన ఇండియన్ టీమ్ 400 పరుగుల భారీ స్కోరు చేసి 223 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది.
ఆ తర్వాత తన రెండో ఇన్నింగ్స్ ఆడిన ఆస్ట్రేలియా 32.3 ఓవర్లలో 91 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. రెండో ఇన్నింగ్స్లో రవిచంద్రన్ అశ్విన్ అత్యధికంగా ఐదు వికెట్లు తీసి వావ్ అనిపించాడు. మహ్మద్ షమీ, రవీంద్ర జడేజా రెండేసి వికెట్లు తీసుకున్నారు. అక్షర్ పటేల్ కు ఒక వికెట్ పడింది.
కాగా ఆస్ట్రేలియా టీమ్ లో స్టీవ్ స్మిత్ 25 పరుగులు చేసి నాటౌట్ గా ఉన్నాడు. ఆ తర్వాత మార్నస్ లబుశ్చగ్నే, డేవిడ్ వార్నర్, అలెక్స్ క్యారీ మాత్రమే రెండంకెల స్కోరు మాత్రమే చేయగలిగారు.