సాధారణంగా దొంగలు ఇళ్లు, దుకాణాలు, బ్యాంకుల్లోకి చొరబడి నగదు, విలువైన వస్తువులను దోచుకెళ్తుంటారు. కొన్ని కొన్ని సార్లు సినీఫక్కీల్లో అక్కడక్కడా వినూత్నరీతుల్లో దొంగతనాలు జరుగుతుండటం వింటుంటాం. అధికారులను, జనాలను బురిడీ కొట్టించే మహామాయగాళ్లు ఉంటారు. అయితే, బీహార్ రాష్ట్రంలో ఇటీవల ఇలాంటి వింత దొంగతనాలు చోటుచేసుకుంటున్నాయి. బ్రిడ్జ్లనే టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్నారు దుండగులు. 60 అడుగుల బ్రిడ్జ్ను ఎత్తుకెళ్లిన నెల రోజుల్లోనే మరో బ్రిడ్జ్ను మాయం చేశారు.
బీహార్ రాష్ట్రంలో ఇటీవల రోహ్తాస్ జిల్లాలో 60 అడుగుల బ్రిడ్జ్ను ఎత్తుకెళ్లారు దుండగులు. ఈ ఘటన జరిగిన నెలరోజుల్లోనే మరో వంతెనను మాయం చేశారు దొంగలు. అయితే, ఈసారి దొంగలు పక్క జిల్లాలో తమ పనితనాన్ని చూపించారు. బాంకా జిల్లా చందన్ బ్లాక్లో 2004 నాటి 80 అడుగుల ఐరన్ బ్రిడ్జ్ను.. గ్యాస్ కట్టర్ల సాయంతో ముక్కలుగా చేసి ఎత్తుకెళ్లారు. ప్రస్తుతం 70 శాతం వంతెన మాయమైంది.
ప్రపంచ ప్రసిద్ధి చెందిన శ్రావణి జాతరలో ఝాఝా గ్రామం నుంచి పటనియా ధర్మశాలకు వెళ్లేందుకు ఊరేగింపు పెద్ద వాగులో నుంచి వెళ్లాల్సి వచ్చింది. అయితే, 1995లో భారీ వరదల సమయంలో పలువురు ప్రమాదానికి గురయ్యారు. దీంతో వంతెన నిర్మించాలని ప్రజలు డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో 2004లో 80 అడుగుల పొడవు, 15 అడుగుల వెడల్పుతో.. అప్పటి జిల్లా పాలనాధికారి ఆధ్వర్యంలో వంతెన నిర్మించారు. దీంతో భక్తులు సులభంగా బాబా ధామ్కు చేరుకోగలిగారు. అయితే, పుక్కా బ్రిడ్జ్ సహా కొత్తగా మరో రెండు వంతెనలు నిర్మించిన క్రమంలో దీనిని ప్రస్తుతం వినియోగించటం లేదు. దీంతో ఈ బ్రిడ్జ్పై దొంగల కళ్లు పడ్డాయి.
ఈ ఘటనపై పోలీసు అధికారి నషీమ్ ఖాన్ మాట్లాడుతూ.. వంతెన చోరీకి గురైనట్లు తమకు ఎలాంటి సమాచారం అందలేదని, ఏ ఒక్కరు ఫిర్యాదు చేయలేదన్నారు. తమ దృష్టికి రాగానే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.