అధికార పార్టీ శ్రేణులు భూతగాదాల్లో చిక్కుకోవడం సర్వసాధారణమైపోతుంది. ఎమ్మెల్యేల అనుచరులు యథేచ్చగా భూకబ్జాలకు పాల్పడుతున్న సంఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి అనుచురుడు తన భూమి లాక్కున్నాడని తనకు న్యాయం చేయాలని..లేక పోతే పిల్లలతో పాటు తనకు కారుణ్య మరణానికి అనుమతించాలని ఓ రైతు కుటుంబం నిన్ననే హెచ్ఆర్సీని ఆశ్రయించింది. ఇక తాజాగా బీఆర్ఎస్ కార్పొరేటర్ ఏకంగా భూ కబ్జా కేసులో కటకటాల వెనక్కి నెట్టబడ్డాడు.
వరంగల్ నగరంలో భూ కబ్జాకు యత్నించిన అధికార పార్టీ కార్పరేటర్ పై బాధితుల ఫిర్యాదు మేరకు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి సెకండ్ అడిషనల్ జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచారు. తరువాత ఖమ్మం జైలుకు తరలించారు. హనుమకొండ కాకతీయ కాలనీ ఫేజ్ 2 లో సునీత అనే మహిళ పేరు మీద ఉన్న 200 గజాల స్థలంపై కార్పొరేటర్ వేముల శ్రీనివాస్ కన్ను పడింది.
డెవలప్ మెంట్ పేరుతో ఆ స్థలాన్ని అప్పగించాలని సునీత దంపతులను పలుమార్లు అడిగాడు. అప్పటికే ఆ స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు ఆమె పర్మిషన్ కూడా తీసుకున్నారు. దీంతో ఆ స్థలాన్ని కార్పొరేటర్ కు ఇచ్చేందుకు నిరాకరించింది. స్థలాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలనే ఆలోచనతో ఈ నెల 13 న తన అనుచరులతో అక్కడికి వెళ్లిన వేముల శ్రీనివాస్ బాధితులు నిర్మించుకున్న కాంపౌండ్ వాల్ ను కూలగొట్టి దౌర్జన్యం చేశాడు.
తమను బెదిరింపులకు గురి చేయడంతో పాటు ఆస్తి ధ్వంసం చేయడంతో ఈ నెల 17న బాధితులు హనుమకొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ప్రాథమిక విచారణ చేపట్టిన పోలీసులు..సీపీ ఏవీ రంగనాథ్ ఆదేశాలతో కార్పొరేటర్, అతని డ్రైవర్ పడాల కుమారస్వామిపై ఐపీసీ 427,447, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిందితులను మేజిస్ట్రేట్ ఆదేశాలతో ఖమ్మం జైలుకు తరలించారు. కాగా భూకబ్జా నేపథ్యంలో అధికార పార్టీ కార్పొరేటర్ ను జైలుకు తరలించడంతో మిగతా కబ్జాకోరుల్లోనూ గుబులు మొదలైంది.