బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కొండగల్ లో అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. శుక్రవారం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. గుర్నాథ్ రెడ్డికి రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మాజీ ఎమ్మెల్యేతో పాటు ఆయన కుమారుడు, కొడంగల్ మున్సిపల్ చైర్మన్ ఆర్. జగదీశ్వర్ రెడ్డి కూడా కాంగ్రెస్ గూటికి చేరారు.
అధికారపార్టీలో ఆయన సీనియారిటీకి తగిన గుర్తింపు, ప్రాధాన్యం దక్కడం లేదని కొంతకాలంగా మథన పడుతున్నారు. అందుకే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లుగా సమాచారం. ఇటీవల నియోజకవర్గంలోని కోస్గి పట్టణానికి మంత్రి కేటీఆర్ వచ్చారు. ఆ కార్యక్రమానికి గురునాథరెడ్డిని ఆహ్వానించలేదట.
అయినప్పటికీ బహిరంగ సభ వద్దకు వచ్చిన ఆయనను పాస్ లేదని వేదికపైకి అనుమతించలేదట పోలీసులు. దీంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారని తెలుస్తోంది. కొడంగల్ నియోజకవర్గంలోని దిగ్గజ నాయకుల్లో గుర్నాథ్ రెడ్డి ఒకరు.
ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఘనత గుర్నాథ్ రెడ్డికి ఉంది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపులో కీలక పాత్ర పోషించారు. తాజాగా గుర్నాథ్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరడం కొడంగల్ రాజకీయాల్లో పెను మార్పునకు నాంది పలుకుతుందని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.