టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ప్రభుత్వ విప్ రేగా కాంతారావు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘హాథ్ సే హాథ్’ జోడో పాదయాత్రలో భాగంగా రేవంత్ చేసిన వ్యాఖ్యలపై రేగా కాంతారావు కౌంటర్ అటాక్ ఇచ్చారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ఖబడ్దార్.. రేగా కాంతారావుతో పెట్టుకోకంటూ హెచ్చరించారు.
గిరిజనుడిని అనే అక్కసుతో నన్ను తొలగించిన వీళ్లా.. నా గురించి మాట్లాడేదన్నారు. తెలంగాణ అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందించేందుకు నేను రాజ్యాంగ బద్ధంగా విలీనమయ్యానన్నారు. ఓటుకు నోటు కేసులో ఉన్న వీళ్లా నా గురించి మాట్లాడేదంటూ ఎద్దేవా చేశారు. నేను 300 ఎకరాలు ఆక్రమించినట్టు రుజువు చేయండి.. ముక్కు నేలకు రాస్తా అంటూ సవాల్ విసిరారు.
రేవంత్ వ్యాఖ్యలపై పరువు నష్టం దావా వేస్తానని చెప్పారు. అన్ని స్టేషన్లలో ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు. నాపై వేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే అసలు పోటీ నుంచే తప్పుకుంటానని ఆయన స్పష్టం చేశారు.
పినపాకలో కాంగ్రెస్ పార్టీని బతికించినట్లు తెలిపారు. ఇక్కడ బలంగా ఉందంటే తానే కారణమని చెప్పుకొచ్చారు. డీసీసీ అధ్యక్షునిగా ఎక్కువ కాలం ఉన్నది తానొక్కడినే అని ఆయన తెలిపారు రేగా కాంతారావు.