లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు పంపించింది. గురువారం విచారణకు రావాలని స్పష్టం చేసింది. అయితే.. ఆరోజు కుదరదని కవిత రిటర్న్ లేఖ పంపారు. ఈ నేపథ్యంలో నోటీసులపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఒక్కొక్కరుగా బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు.
ఈడీ బోడీలను అడ్డుపెట్టుకుని కేంద్రం ఎన్ని వేషాలు వేసినా భయపడబోమని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం కవిత ఢిల్లీలో ఆందోళనకు సిద్ధమైతే బీజేపీకి వెన్నులో వణుకుపుట్టిందని ఎద్దేవ చేశారు. అందుకే, ఇలాంటి కుట్రలు చేస్తున్నారని అన్నారు. కేంద్రం విధానాలను ప్రశ్నించిన వారిపై కేసులతో లొంగదీసుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. కేంద్ర వేధింపులకు భయపడబోమని దేశమంతా మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకుంటుంటే ఒక మహిళ పట్ల ఈ విధమైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం దుర్మార్గపు చర్య అని దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ అన్నారు. ఇలాంటి చర్యలు బీజేపీ పతనానికి నాంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. కవితకు ఈడీ నోటీసులు మోడీ ప్రభుత్వ దుర్మార్గాలకు పరాకాష్ట అని విమర్శించారు. మోడీ దురాగతాలను బయటపెడుతున్న కేసీఆర్ పై కుట్రలో భాగమే కవితకు నోటీసులు అని అన్నారు. అణచివేత దోరణితో దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుని ప్రతిపక్షాలను భయపెట్టాలని బీజేపీ చూస్తోందని విమర్శించారు. మోడీ దుర్మార్గాలకు రోజులు దగ్గర పడ్డాయన్న మంత్రి.. ప్రజల కోసం పని చేసే నేతలకు కేసులు, జైళ్లు కొత్త కాదని స్పష్టం చేశారు.
ప్రశ్నించేవారి గొంతు నొక్కడానికే నోటీసులు జారీ చేశారని మండిపడ్డారు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్త. మహిళా దినోత్సవం రోజున మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా? అని ప్రశ్నించారు. రిజర్వేషన్ కోసం జంతర్ మంతర్ దీక్షకు ఏర్పాట్లు జరుగుతుంటే ఇలా చేయడం సమంజసమేనా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని వారం రోజుల క్రితమే కవిత ప్రకటించారని.. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే నోటీసులు వచ్చాయని ఆరోపించారు. నోటీసులు ఇవ్వడాన్ని తప్పుపట్టడం లేదన్న ఆయన.. తేదీ, సందర్భంపై అభ్యంతరం తెలిపారు.